మహబూబ్నగర్ : మన ఊరు- మన బడి కింద రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7 వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలల మాదిరిగా తీర్చిదిద్దుతున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
సోమవారం ఆయన జిల్లా కేంద్రంలోని రామయ్య బౌలి పాఠశాలలో 27.87 లక్షల రూపాయలతో మన ఊరు మన బస్తి కింద చేపట్టనున్న పాఠశాల కిచెన్ సెడ్, టాయిలెట్, కాంపౌండ్ వాల్ ఆధునీకీకరణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దేందుకు మన ఊరు- మన బడి కింద పనులు చేపట్టామన్నారు. 3 సంవత్సరాలలో ప్రతి పాఠశాలను బాగు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశమన ఆయన పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలను అమలు చేస్తున్నామన్నారు.
గతంలో రామయ్య బౌలి ప్రాంతం చాలా వెనకబడి ఉండేదని ,శిల్పారామం,ట్యాంక్ బండ్ అభివృద్ధి వల్ల ఇప్పుడు అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందన్నారు. మహబూబ్ నగర్ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. మన ఊరు- మన బడి కింద చేపట్టే పనులు దుర్వినియోగం కాకూడదని, పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, పనులు నాణ్యతతో ఉండాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మూడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కె.సి. నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహమాన్, ఆర్డీఓ అనిల్, డీఈఓ ఉషారాణి, తదితరులు పాల్గొన్నారు.