కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ) : మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొంటేనే తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మిస్తామని రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. శుక్రవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తమ్మిడిహట్టి గ్రామ శివారులోని ప్రాణహిత నదిపై బరాజ్ నిర్మించే ప్రాంతాన్ని, 2008లో వైఎస్ఆర్ ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణ కోసం వేసిన పైలాన్ను మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ్మిడిహట్టి మీద 150 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని దీనికోసం మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చేలా తెలంగాణలోని ఎంపీలు చొరవతీసుకోవాలని సూచించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటేనే బరాజ్ నిర్మాణం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
2008లో వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించేందుకు పనులు ప్రారంభించారని గుర్తుచేశారు. కొన్ని కారణాల వల్ల అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయిందని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ పభుత్వం తమ్మిడిహట్టి మీద 150 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మించాలని నిర్ణయించిందని చెప్పారు. దీనికోసం మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా కావాలని, మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చేలా తెలంగాణలోని ఎంపీలు చొరవతీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించాల్సిన అవసరమున్నదని తెలిపారు. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కూడా మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖరాశారని, ఈ నెలాఖరు వరకు మహారాష్ట్ర సీఎంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భేటీకానున్నట్టు తెలిపారు.
మంత్రుల పర్యటనపై విమర్శలు
తమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మించి తీరుతామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొంటేనే బరాజ్ నిర్మాణమవుతుందని, దీనికోసం తెలంగాణలోని బీజేపీ మంత్రులు, ఎంపీలు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత తీసుకోవాలనడంపై జిల్లా రైతాంగంలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. జిల్లాలో అర్ధాంతరంగా ఉన్న అనేక ప్రాజెక్టులను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం తమ్మిడిహట్టి మీద బరాజ్ నిర్మిస్తామని ఇంతకాలం ఊదరగొట్టి.. ఇప్పుడేమే బీజేపీ సహకారం ఉంటేనే బరాజ్ నిర్మిస్తామని మంత్రులు చెబుతుండటంపై రైతుల్లో నిరాశ వ్యక్తమవుతున్నది.
గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం 148 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నదని పేర్కొన్నారు. ఇన్ని రోజులు తమ్మిడిహట్టి బరాజ్ కట్టితీరుతామని ఊదరగొట్టి.. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నదనే విమర్శలు వస్తున్నాయి. మహారాష్ట్ర అనుమతి లేకుండా తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణం సాధ్యం కాదని తెలిసినప్పటికీ ..ఇన్ని రోజులు తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్ సర్కార్, చివరికి బీజేపీ మీదికి తోసేసి చేతులు ఎత్తేసేందుకు సిద్ధమైందనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో బీటలు వారుతున్న కుమ్రం భీం ప్రాజెక్టుతోపాటు, ఓపెన్ కాస్ట్ కారణంగా అంతరించిపోతున్న వట్టివాగు, అర్ధాంతరంగా నిలిచిపోయిన చెలిమెల వాగు, జగన్నాథ్పూర్, పీపీరావు ప్రాజెక్టులను బాగుచేస్తే కనీస స్థాయిలోనైనా పంటలకు నీరు అందుతుందని రైతులు పేర్కొంటున్నారు.