మహబూబ్ నగర్ : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు ఎన్ని అవాంతరాలు వచ్చినా పూర్తి చేసి తీరుతామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. మహాశివరాత్రి సందర్భంగా వీరన్నపేట పెద్ద శివాలయంలో ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.
పాలమూరు ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఆయన స్పందించారు. ప్రాజెక్టు పూర్తయితేనే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుందని, పేదరికం, కష్టాలు శాశ్వతంగా దూరమవుతాయని పేర్కొన్నారు . రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులను పూర్తిచేసిన ప్రభుత్వం కచ్చితంగా పాలమూరు ప్రాజెక్టును కూడా పూర్తి చేసి అన్నదాతకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
ప్రాజెక్టు నిర్మాణం ఉమ్మడి జిల్లా ప్రజల న్యాయమైన కోరిక అని తెలిపారు. కరువు ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రాజెక్టు అత్యవసరమని పేర్కొన్నారు. సాగునీటి లభ్యత పెరిగితే జిల్లా స్వరూపమే మారుతుందని, ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం వల్ల లక్షల ఎకరాల్లో పంటలు పండుతున్నాయన్నారు. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా ఎండాకాలంలో కూడా వాగుల్లో పుష్కలంగా నీళ్లు ప్రవహిస్తున్నాయన్నారు. చెరువుల పూడికతీత వల్ల సాగునీటి లభ్యత పెరిగిందన్నారు.