ఖమ్మం రూరల్, జూన్ 23: అర్హులందరికీ పింఛన్లు, రేషన్కార్డులు అందజేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అదే సమయంలో అనర్హులు పొందుతున్న పింఛన్లను రద్దు చేస్తామని, రేషన్ కార్డులను తొలగిస్తామని స్పష్టంచేశారు. ప్రభుత్వ పథకాల్లో పేద కుటుంబాలకే ప్రథమ ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. ఆదివారం ఆయన ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన, స్థానికుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం నాయుడుపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. జూలై 1 నుంచి ఆగస్టు 15లోగా అర్హత కలిగిన ప్రతి రైతుకూ రూ.2 లక్షల్లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని తెలిపారు.