మేడ్చల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉంటామని మేడ్చల్, మల్కాజిగిరి రైతులు తీర్మానం చేశారు. ఈమేరకు మంగళవారం మేడ్చల్,మల్కాజిగిరి జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసి తీర్మానం ప్రతిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ( Minister Mallareddy ) కి అందజేశారు. తామంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) వెంటే ఉంటామని రైతులు పేర్కొన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, అందుబాటులో ఎరువులు, పంటలకు గిట్టుబాటు ధరలు అందిస్తున్న ముఖ్యమంత్రికి అండగా ఉంటామని స్పష్టం చేశారు.
ఉచిత విద్యుత్పై టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ( Revanth Reddy ) వ్యాఖ్యలను నిరసనగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్గడి మలక్పేటలో మంగళవారం రైతు వేదిక సభను నిర్వహించి రైతులకు మద్దతు తెలిపారు. రైతు వ్యతిరేకి రేవంత్రెడ్డి ఉచిత కరెంట్ పై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ( Minister Mallareddy ) మండిపడ్డారు. రైతుల జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు ఖాయమని అన్నారు. ఇటీవల అమెరికాకు వెళ్లిన రేవంత్రెడ్డి అక్కడ ఎన్ఆర్ల వద్ద ముష్టి ఎత్తుకున్నాడని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక పేరిట డబ్బులు దోచుకుని పార్టీని విడిచి పారిపోవడం ఖాయమన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రజలు ఛీ కొడతారని అన్నారు. ఎంపీగా ఉన్న మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాను అభివృద్ధి చేయలేని రేవంత్రెడ్డి రాష్ట్రానికి ఏం చేస్తారని ఎద్దెవా చేశారు. రైతుల కష్టాలు తెలియని రేవంత్ ఉచిత విద్యుత్పై మతిభ్రమించి మాట్లాడుతున్నాడని ఆరోపించారు.
రైతులకు అండగా సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) రైతులకు అండగా నిలబడుతారని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేసేందుకు 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతుబంధు ( Raitu Bandu ), రైతుబీమా (Raitu Beema ) పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దినట్లు చెప్పారు.
రైతుల కష్టాలను గుర్తించిన కేసీఆర్ వ్యవసాయసాగుకు కల్పించిన సౌకర్యాలను అందిపుచ్చుకుని పంటలు పండిస్తుంటే కాంగ్రెస్ నాయకులకు కళ్లు మండుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే చీకటి రోజులు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు నారెడ్డి నందారెడ్డి, ఎంపీపీ ఎల్లూబాయి, జడ్పీటీసీ అనితా, సర్పంచ్ వనజ శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ ఇందిరా, మద్దుల శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.