జనగామ : కేంద్ర ప్రభుత్వం పద్ధతి చూస్తుంటే కాకులను కొట్టి గద్దలకు వేస్తున్నట్టుగా ఉందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన దళారులకు 11 లక్షల కోట్లు కేంద్రం మాఫీ చేసింది. అందులో 11 వేల కోట్లు ఆరుగాలం కష్టపడే రైతుల పంటల కొనుగోలుకు పెట్టమంటే కేంద్రం వెనకా ముందు ఆడుతుందని విమర్శించారు. తెలంగాణ రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని చెబుతున్న కేంద్ర వైఖరిని నిరసిస్తూ, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టింది. అందులో భాగంగా పాలకుర్తి నియోజవర్గంలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు.
గత ఏడేళ్లలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో 23 లక్షల కోట్ల ఆదాయం కేంద్రానికి వచ్చింది. అందులోంచి దేశానికి అన్నం పెట్టే రైతన్నకు 10 వేల కోట్లు కూడా ఇవ్వలేరా? అని మంత్రి ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతోందా? లేక దళారీలా వ్యవహరిస్తుందా? తెలియడం లేదు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఘోరంగా మాట్లాడుతున్నారు. బండి సంజయ్ కేంద్రంతో బియ్యం, ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత తనదేనని, సీఎం కేసీఆర్ మాటలు పట్టించుకోవద్దని అంటారు.
కిషన్ రెడ్డి వరి వేయమని రైతులకు చెబుతారు. ఇప్పుడు అంతా కలిసి రాష్ట్రమే కొనుగోలు చేయాలని గోల్ మాల్ చేస్తున్నారు అని మంత్రి మండిపడ్డారు. బీజేపీ అబద్ధాలతో అధికారంలోకి వచ్చి పబ్బం గడుపుతున్నదని ఆరోపించారు. కేంద్రం మెడలు వంచి అయినా సరే ధాన్యం కొనుగోలు చేసే వరకు ఆందోళన విరమించ బోమని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు.