హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): దేశంలో సంకుచిత, ఉద్విగ్న, విద్వేషపూరిత, విభజన వాతావరణం ఉన్న తరుణంలో.. తెలంగాణ అస్తిత్వం కోసం, ప్రజల కోసం టీయూడబ్ల్యూజే ఎలా పోరాడిందో.. అట్లాగే జాతీయస్థాయిలో ఉద్యమాన్ని నిర్మించడానికి ఐజేయూతో కలుస్తున్నామని మీడియా అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లం నారాయణ పేర్కొన్నారు.
దాదాపుగా 17 రాష్ర్టాల్లో ప్రతినిధులను కలిగి ఉన్న ఒక పెద్ద సంస్థతో కలిసి పనిచేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కేంద్రం జర్నలిస్టులకు ఉన్న చట్టాన్ని రద్దు చేసిందే తప్ప, మరో చట్టాన్ని తేలేదని.. సమగ్ర చట్టం సాధించేందుకు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాడుతామని చెప్పారు. ఆదివారం నుంచి పటాన్చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్లో మూడు రోజులపాటు టీయూడబ్ల్యూజే -143 ద్వితీయ రాష్ట్ర మహాసభలు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ 10వ ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మహాసభల ఏర్పాట్లను శనివారం అల్లం నారాయణ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో మీడియా విస్తృతి పెరిగిందని, సంప్రదాయ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు, డిజిటల్ మీడియా వచ్చిన తరుణంలో సమగ్ర చట్టం తేవాల్సిన అవసరం ఉన్నందున, కేంద్రంపై కొట్లాడేందుకు ఐజేయూతో కలిసి పనిచేయాలనుకున్నట్టు తెలిపారు. జాతీయస్థాయిలో ఇంతకుముందున్న ఐజేయూ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున దాని గురించి ఎక్కువ మాట్లాడలేమని పేర్కొన్నారు. దాదాపు 20 వేల మందికి అక్రెడిటేషన్లు, హెల్త్ కార్డులు, 19 వేల మందికి ఇన్సూరెన్స్, డెస్క్ జర్నలిస్టులకు టీయూడబ్ల్యూజే చొరవ ఫలితమేనని చెప్పారు.
జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏర్పాటైన ఏకైక యూనియన్ టీయూడబ్ల్యూజేఅని, రాష్ట్రంలో జర్నలిస్ట్ ఫండ్ సాధించటంలో, మీడియా అకాడమీ ఏర్పాటు, కరోనా బారిన పడ్డవారి కోసం దాదాపు రూ.7 కోట్లను ఖర్చు చేయడం వెనుక టీయూడబ్ల్యూజే కృషి ఉన్నదని చెప్పారు. ఈ మహాసభలకు మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. మహాసభల తొలిరోజైన ఆదివారం సభల నిర్వహణ నేపథ్యం, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై ప్రతినిధులు చర్చిస్తారు.
అనంతరం కొందరు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) సభ్యులు, 22 రాష్ర్టాల నుంచి వచ్చిన యూనియన్ నాయకులు, వివిధ మీడియా సంస్థల సీఈవోలు, ఎడిటర్లతో ఐజేయూ 10వ ప్లీనరీ నిర్వహించనున్నారు. సోమవారం టీయూడబ్ల్యూజే ప్రతినిధుల సమావేశాలు జరుగుతాయి. ఇందులో యూనియన్ కార్యకలాపాల నిర్వహణ, తదితర అంశాలపై చర్చించనున్నారు. మహాసభల ముగింపురోజైన 10వ తేదీన ‘నూచాలెంజెస్ ఇన్ జర్నలిజం’ అన్నం అంశపై సెమినార్ నిర్వహించనున్నారు.
ఐజేయూ ప్లీనరీపై కొందరు పాత్రికేయులు అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదని టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్ అన్నారు. రాష్ట్రంలో తమ టీయూడబ్ల్యూజే ఆవిర్భవించిన నాటినుంచి తెలంగాణ పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై పూర్తిస్థాయి దృష్టి సారించామని చెప్పారు. నాడు తెలంగాణ కోసం సాగిన ఉద్యమాన్ని పట్టించుకోని, ఆ తరువాత పాత్రికేయుల సంక్షేమం పట్టని కొందరు సీనియర్ జర్నలిస్టుల ముసుగులో తప్పుడు ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని దుయ్యబట్టారు. వారికి జర్నలిస్టు సంఘాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకోవడమే తెలుసునని ఘాటుగా విమర్శించారు.
40 ఏండ్లుగా యూనియన్ పేరు చెప్పుకొని కోట్లుకొల్లగొట్టిన వారికి నీతులు చెప్పే అర్హత లేదని స్పష్టంచేశారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే నేతలు, రాజమౌళిచారి, అవ్వారి భాస్కర్, యోగానందం, యార నవీన్ తదితరులు పాల్గొన్నారు.జర్నలిస్టు ఉద్యమ సీనియర్లలో ఒకరిగా ఉన్న సురేశ్అఖౌరీ వంటి నాయకుల ముక్కుసూటి మనస్తత్వాన్ని సహించని ముఠా ఇప్పుడు భారత జర్నలిస్టు ట్రే్డ యూనియన్ పునరుజ్జీవాన్ని సహించక నెత్తి నోరు మొత్తుకుంటున్నదని టీయూడబ్ల్యూజే జాతీయ వ్యవహారాల ప్రతినిధి పీవీ కొండల్రావు ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ ఇవాళ్టి స్థితికి కారకులైన దొంగలే, దొంగ దొంగ అన్నట్టుగా ప్రొఫెషనల్ ట్రే్డ యూనియన్ లను వేలెత్తి చూపుతున్నారని ఎద్దేవాచేశారు.
జాతీయస్థాయిలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారాలపై చర్చించేందుకు నిర్వహిస్తున్న అన్ని రాష్ర్టాల జర్నలిస్టుల మహాసభలను జయప్రదం చేయాలని ఐజేయూ అధ్యక్షుడు వినోద్ కోహ్లీ కోరారు. శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియా అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్తో కలిసి ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల కనీస వేతనాల కోసం గళమెత్తింది తామేనని కోహ్లీ అన్నారు. దేశంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై స్పందించి పోరాడింది తమ సంఘమేనని తెలిపారు. హైదరాబాద్లో ఐజేయూ సభలను నిర్వహించడం ఆనందంగా ఉన్నదని చెప్పారు. మూడు రోజులపాటు జరిగే పదో ప్లీనరీలో అన్ని అంశాలపై చర్చిస్తామని చెప్పారు.