ధర్మపురి : గోదావరి వరద బాధితులు అధైర్యపడొద్దని.. ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసానిచ్చారు. మంగళవారం ధర్మపురి మండలంలోని ఆరెపెల్లి, దొంతాపూర్ గ్రామాల్లో పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని తెలుసుకొని, బాధితులను పరామర్శించారు. రెండు గ్రామాల్లో 28 మంది బాధితులకు తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున ఆర్థిక సాయంతో పాటు నిత్యావరసర సరుకులను అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతి విలయం కారణంగా ప్రజలతో పాటు రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఎగువన ఉన్న కడెం ప్రాజెక్టు సామర్థ్యానికి మించి, ఊహించని వరద రావడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయన్నారు. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 3లక్షల క్యూసెక్కులైతే.. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఆరు లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో ప్రమాదకర పరిస్థితి ఏర్పడిందన్నారు.
3లక్షల క్యూసెక్కుల అదనంగా రావడంతో అధికారులు ప్రాజెక్టు అన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదలడంతో ఒక్కసారిగా వరద వచ్చి చేరిందన్నారు. ప్రాజెక్టు 18గేట్లలో ఒక్క గేటు మోరాయించగా 17గేట్ల ద్వారా దిగువకు వదిలారన్నారు. అయినప్పటికీ గోదావరి పరీవాహక ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేసి మొత్తం కడెం నుంచి ఇక్కడి వరకు 20గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. ధర్మపురి వద్ద ఎలాంటి ప్రాణ నష్టం జరుగకుండా అధికారులను, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేసి నదీ పరివాహక ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలను తరలించి వారికి భోజన సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు.
1995 తర్వాత ప్రాజెక్టుకు ఈ స్థాయిలో వరద రావడం ఇదే మొదటిసారి అన్నారు. అలాగే వరదల వల్ల కలిగే ఆస్తి, ప్రాణ నష్టాలను వీలైనంతమేర తగ్గించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాగాన్ని, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేశారన్నారు. అలాగే వరదల వల్ల కూలిపోయిన విద్యుత్ స్తంభాలు, చెడిపోయిన ట్రాన్స్ఫార్మర్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణకు చేపట్టామన్నారు. విద్యుత్ సరాఫరాకు అంతరాయం ఏర్పడ్డ చోట తక్షణమే ప్రత్యామ్నాయ సౌకర్యాల ద్వారా విద్యుత్ను పునరుద్ధరించామన్నారు.