వికారాబాద్ : విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేపట్టి శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తలుగా రాణించడానికి ప్రభుత్వం టి హబ్ ను ఏర్పాటు చేసిందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్తగడి లో 50 వ జిల్లా స్థాయి సైన్స్, మాథమేటిక్స్, ఎన్వీరాన్మెంట్ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ప్రతిభను వెలికితీయటానికి సైన్స్ఫేర్లు ఎంతగానో దోహదపడుతాయని అన్నారు
పరిశ్రమలు స్థాపించి, తాము ఎదగటమే కాకుండా నలుగురికి ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ఆసక్తి ఉన్న రంగాల్లో రాణించేలా విద్యార్థులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. వికారాబాద్ జిల్లాలో సైన్స్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని పెద్ద ఎత్తున గురుకులాలు ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థి పై లక్షా 20 వేల రూపాయలు ఖర్చు చేస్తుందని వెల్లడించారు. అనంతరం విద్యార్థులు తయారుచేసిన ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి ,ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, కాలే యాదయ్య , జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ ,రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ , అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ , డీఈవో రేణుకా దేవి , మునిసిపల్ చైర్ పర్సన్ మంజుల రమేశ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.