KTR | ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. ఎన్నికలు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిందేనని స్పష్టం చేశారు.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్లోని గన్పార్క్ వద్ద బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఆరు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం గన్పార్క్ నుంచి అసెంబ్లీకి ర్యాలీకి బయల్దేరి వచ్చారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యమని గ్యారంటీ కార్డులు ఇచ్చి భద్రం చేసుకోమన్నారని గుర్తుచేశారు. ఇంతవరకు ఒక్క గ్యారంటీని నెరవేర్చిందని లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజల తరఫున వృద్ధులు, వితంతువుల తరఫున బడ్జెట్ ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. రూ.2500 మహాలక్ష్మీ నిధులు ఎప్పుడిస్తారని నిలదీస్తామని తెలిపారు. కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు నీటిమూటలయ్యాయని విమర్శించారు.
బడ్జెట్లో రైతులకు, బీసీలకు జరుగుతున్న అన్యాయంపై నిలదీస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. సంక్రాంతి, ఉగాది గడిచినా రైతు భరోసా పడలేదని అన్నారు. ఉద్యోగాలపై బొంకుతున్న కాంగ్రెస్ను అసెంబ్లీలో నిలదీస్తామని తెలిపారు. హామీలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు.