హైదరాబాద్ : జీవో 111 ఎత్తివేయాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. మంగళవారం కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి ప్రాంతంలో ఉన్న ప్రజలకు ప్రభుత్వపరంగా ఇచ్చిన హామీ మేరకు జీవో 111ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ నిర్ణయం ఆయా ప్రాంతాల ప్రజలకు మంచి శుభవార్త అన్నారు. అయితే, జీవో 111 ఎత్తివేత విషయంలో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని, వాటిని తొలగించి జీవో ఎత్తివేస్తామని చెప్పారు. దీనిపై సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ వేశామని సీఎం కేసీఆర్ తెలిపారు.
దీనిపై చీఫ్ సెక్రెటరీ ఆధ్వర్యంలో కమిటీ వేశామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మూసీ నది, ఈసా నది, రెండు జలాశయాలు కలుషితం కాకుండా.. గ్రీన్జోన్ డిక్లేర్ చేస్తూ, మాస్టర్ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తూ జీవో ఇంప్లిమెంట్ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. కొద్ది రోజుల్లో సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ సమావేశం అవుతుందని, ఆ తర్వాత దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అవుతాయని తెలిపారు. అలాగే మే 28 నుంచి జూన్ 5వ తేదీ వరకు పల్లె, పట్టణ ప్రగతి డ్రైవ్ మరోసారి ఉధృతంగా చేపట్టనున్నట్లు తెలిపారు.