KTR | రాజన్న సిరిసిల్ల : పార్లమెంట్ ఎన్నికల్లో నూతనోత్సాహంతో పనిచేసి సత్తాచాటాలని బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్రజల పక్షాన ఉండి వారి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చూడాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేవరకు, పథకాలు ప్రజలకు చేరే వరకు పోరాడాలని సూచించారు. అయ్యప్ప దయ, స్వామి ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. పిల్లాపాపలతో కలకాలం సంతోషంగా ఉండాలని వధూవరులను ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఓవైపు శుభాకార్యాలు, మరోవైపు ఆప్తులను కోల్పోయిన కుటుంబాలను కలిసి పరామర్శించి ‘నేనున్నా’ అంటూ కేటీఆర్ ధైర్యం చెప్పారు. వార్డులోని ప్రజలను కలిసి ‘బాగున్నారా’ అంటూ యోగా క్షేమాలు తెలుసుకుంటూ ఆప్యాయంగా పలుకరించారు. అనంతరం వచ్చే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్ల ప్రజలకు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పునరుద్ఘాటించారు. అభివృద్ధిలో సిరిసిల్లను రాష్ర్టానికే ఆదర్శంగా నిలిపానని అన్నారు. ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందని, అందుకు తాను శాయాశక్తులా కృషి చేస్తానని చెప్పారు. ప్రజాపాలనలో అర్హులందరితో అన్ని పథకాలకు దరఖాస్తు చేయించాలని నాయకులకు సూచించారు. పట్టణ ప్రజలకు ఏ సమస్యలున్నా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే స్పందించాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విలీన గ్రామాలను తిరిగి గ్రామ పంచాయతీలుగా చేసేందుకు మున్సిపల్లో తీర్మానం చేయాలని చైర్పర్సన్ జిందం కళ, కౌన్సిలర్లను ఆదేశించారు. అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా నేరుగా తనకు చెప్పాలన్నారు. స్వయంగా తానే వచ్చి పరిష్కరిస్తానని స్పష్టం చేశారు.