తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు. FITUR పేరుతో ప్రఖ్యాతిగాంచిన స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లోని IFEMAలో జరుగుతున్న అంతర్జాతీయ టూరిజం ట్రేడ్ ఫెయిర్లో తెలంగాణ పర్యాటక శాఖ స్టాల్ను మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీకైన బోనాలను కనుల పండుగగా నిర్వహించారు. ఒగ్గు డోలు, ఒగ్గు కథ, కూచిపూడి, భారత నాట్య కళాకారులు నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది.
తెలంగాణ పర్యాటక రంగానికి మంచి భవిష్యత్తు ఉందని, కావాల్సిందల్లా పర్యాటక కేంద్రాలకు అవసరమైన రవాణా, ఇతర మౌలిక వసతుల కల్పన చేపట్టడమేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వివిధ ప్రాంతాల్లో జరిగే పండుగలు, పురాతన కట్టడాలు ఇలా ప్రతి చోటా పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశాలున్నాయని, ఆ దిశగా పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.