హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు రూ.18 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ను ప్రభుత్వం చెల్లించిందని ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో సభ్యుడు సంజయ్కుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఏటా సగటున రూ.2,000 కోట్లు చెల్లిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 1.47 కోట్ల మంది విద్యార్థులు లబ్ధిపొందినట్టు వివరించారు.
మత్స్య సొసైటీల్లో మరో లక్ష మందికి సభ్యత్వం: మంత్రి తలసాని
రాష్ట్రంలో మత్స్య సహకార సొసైటీల్లో మరో లక్ష మందికి సభ్యత్వం కల్పిస్తామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రకటించారు. ప్రస్తుతం 5,112 మత్స్య సహకార సొసైటీల్లో 3.65 లక్షల మందికి సభ్యత్వం ఉన్నదని వివరించారు. చేపల వంటకాలను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్రంలో త్వరలో మూడు రోజులపాటు ఫిష్ ఫెస్టివల్ను నిర్వహిస్తామని చెప్పారు. అసెంబ్లీలో సభ్యులు ఏ జీవన్రెడ్డి, ముఠాగోపాల్, కల్వకుంట్ల విద్యాసాగర్రావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. చేప పిల్లలు, రొయ్య పిల్లలను నిల్వ చేయడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.84 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వమే చేప పిల్లలను తయారు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నదని చెప్పారు. కొర్రమీను పెంపకానికి తెలంగాణలో అనువైన వాతావరణం లేదని చెప్పారు.
కల్తీ పాల తయారీపై కఠిన చర్యలు
రాష్ట్రంలో ప్రైవేట్ పాల విక్రయదారులు పాలను కల్తీ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హెచ్చరించారు. రాష్ట్రంలో విజయ డెయిరీకి పాలు పోసే వారికి లీటరుకు రూ.4 ప్రొత్సహకంగా ఇస్తున్నామని, ఇప్పటివరకు రూ.365 కోట్లు చెల్లించామని వెల్లడించారు. తెలంగాణకు రోజుకు 116.69 కోట్ల లీటర్ల పాలు అవసరమని చెప్పారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో గండ్ర వెంకట రమణారెడ్డి, జైపాల్యాదవ్, భాస్కర్రావు అడగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.
సొసైటీలకు వైన్ షాపులు: మంత్రి శ్రీనివాస్గౌడ్
వైన్ షాపులను గౌడ కులస్థులకు ప్రస్తుతం వ్యక్తిగతంగా కేటాయిస్తున్నామని, వీటిని సొసైటీలకు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఎైక్సెజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గీత కార్మికుల కులవృత్తికి సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత నెక్లెస్రోడ్లో నీరాకేఫ్ను ప్రారంభిస్తామని చెప్పారు.
త్వరలో క్రీడాపాలసీపై నివేదిక
క్రీడా విధానంపై నియమించిన క్యాబినెట్ సబ్కమిటీ త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం, ప్రతి నియోజకవర్గంలో స్టేడియం ఉండాలనేది ప్రభుత్వ విధానమని చెప్పారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తప్పులు చేస్తే దానిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనంతగిరిని అభివృద్ధి చేస్తాం
వికారాబాద్ వద్ద ఉన్న అనంతగిరిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఇప్పటికే అక్కడ హరితవ్యాలీ రిసార్ట్ను ఏర్పాటు చేశామని చెప్పారు. కోటిపల్లి ప్రాజెక్టును కూడా అభివృద్ధి ప్రణాళికలో చేర్చామని చెప్పారు.
4,667 కోట్లతో చెక్డ్యాంలు: మంత్రి హరీశ్రావు
రాష్ట్రంలో చేపట్టిన చెక్డ్యాంల ద్వారా ఐదు లక్షల ఎకరాల ఆయకట్టుకు పరోక్షంగా లబ్ధి చేకూరిందని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు తెలిపారు. తెలంగాణలో ఇప్పటివరకు రూ.4,667 కోట్లతో 1,416 చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టగా ఇందులో 303 పూర్తి అయ్యాయని వివరించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.78 కోట్లతో 14 కొత్తచెక్ డ్యాంలను చేపట్టామని తెలిపారు.