జగిత్యాల : ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయరంగంలో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం రాయికల్ పట్టణ పీఏసీఎస్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత పంటల విస్తీర్ణం, పంటల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీటి లభ్యత పెరిగిందని, మిషన్ కాకతీయ పథకం ద్వారా పూడిక తీయడం వల్ల చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయని పేర్కొన్నారు. జగిత్యాల నియోజకవర్గ పరిధిలో 2015లో 27వేల ఎకరాలు సాగు అవుతుండగా నేడు 65వేల ఎకరాల్లో పంటలు సాగు అవుతున్నాయని వెల్లడించారు.
తోంబరావు పెట్ వద్ద తూమ్ ఏర్పాటు చేయటం ద్వారా భూగర్భ జలాలు పెరిగాయని ఎమ్మెల్యే తెలిపారు. 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంట్ తెలంగాణ అందిస్తుండడంతో రైతు జీవన విధానంలో మార్పు వచ్చిందన్నారు. టార్చి లైట్ లేకుండా రైతు తెల్లవారుజాము, రాత్రి పొలం వద్దకు ధైర్యంగా వెళ్లి వస్తున్నాడని వివరించారు.