KTR | ‘అధికార మత్తు అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే.. మాకు అసెంబ్లీ సమావేశాల్లో అప్పుడప్పుడు ఆశ్చర్యమేస్తది. రేవంత్ రెడ్డి గారు సీఎం కేసీఆర్ అంటారు. ఇంకొకరు లేచి మమ్ముల్ని మంత్రులు అంటారు. ప్రభుత్వంలో ఇంకా మేమే ఉన్నాం అనుకుని, ప్రతిపక్షంలో వాళ్లు ఉన్నాం అనుకుని మాట్లాడుతున్నారు. వాళ్లు ప్రతిపక్షంలో ఉన్నామన్నట్లు మాట్లాడుతున్నారు. మేమేమీ లేం. మాకు స్పష్టంగా ఉన్నాం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ టీవీ చానెల్ లైవ్ షోలో చెప్పారు.
‘ప్రజలు మా పనితీరును ఎక్కడ తక్కువ చేయలేదనేది మాకు అర్థమైంది. కాకపోతే కొన్ని కొన్ని విషయాల్లో.. ప్రజా సంబంధాల విషయంలో కొంత అసంత్రుప్తి ఉన్న మాట వాస్తవం. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వంలోకి వచ్చింది. మేం ప్రతిపక్షంలో ఉన్నాం. ఓటింగ్ శాతంలో తేడా కేవలం 1.8 శాతమే. 14 సీట్లలో మా ఓటమి చాలా తక్కువ తేడాతో జరిగింది. ఉదాహరణకు జుక్కల్ స్థానంలో 1152 ఓట్ల తేడాతో ఓడిపోయాం. పక్కన దేవరకద్రలో 1300 ఓట్ల తేడాతో ఓటమి.. 14 సీట్లలో 6000 ఓట్ల కంటే తక్కువ తేడాతో ఓడిపోయాం. ఆ 14 సీట్లలో మేం ఏడు గెలిచి ఉన్నా పరిస్థితి వేరుగా ఉండేది. స్వల్ప తేడాతో ఓటమి పాలైనందుకు బాధ లేదు’ అని కేటీఆర్ చెప్పారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. 17 లోక్ సభా స్థానాల్లో సమీక్షల తర్వాత ఆ విషయం అర్థమైంది. అసెంబ్లీ స్థానం నుంచి వంద మంది నుంచి 200 మంది నేతలతో సమీక్షించుకున్నాం. పర్యటనల్లో కార్యకర్తలతో మాట్లాడినప్పుడు అర్థమైంది. సమాజంలో వచ్చిన మార్పులను పసిగట్టలేక పోయినం. దళిత బంధు కార్యక్రమం అమలు చేశాం. చాలా మంచి ఉద్దేశంతో పని చేశాం. సమాజంలో అట్టడుగున దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న దళితుల అభ్యున్నతికి కృషి చేసి, తదుపరి ఎస్టీలు, బీసీల అభ్యున్నతి కోసం పని చేయాలని అనుకున్నాం. ఆ విషయం ప్రజలకు చేరవేయడంలో విఫలం అయ్యాం. పార్టీ, క్యాడర్ విఫలం అయ్యాం’ అని కేటీఆర్ అన్నారు.
రైతుబంధు అనే అద్భుతమైన పథకం అమలు చేశాం అనుకున్నాం. 70 లక్షల మంది రైతులకు వారి ఖాతాల్లో రూ.70 వేల కోట్లు జమ చేశాం అనుకున్నాం తప్ప.. పేద రైతు, పెద్ద రైతుల మధ్య తేడాను గమనించలేకపోయాం. పెద్ద రైతులకు ఎందుకు ఇస్తున్నారన్న ప్రశ్న ఉత్పన్నమైంది. దీన్ని మేం పసిగట్టలేకపోయాం. పదేండ్లలో మా రాష్ట్రం.. మేం తెచ్చిన రాష్ట్రం. ఏ పంచాయతీలు పెట్టుకోలే. ప్రజలతో మమేకం అయ్యాం.. హరిత హారం, మిషన్ భగీరధ. కల్యాణ లక్ష్మి వంటి పలు పథకాలతో ప్రజలతో మమేకం అయ్యాం’ అని చెప్పారు.