హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ):ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో తెలంగాణ సాగునీటిరంగం దేశానికే ఆదర్శంగా నిలిచిందని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా కొనసాగుతున్నదని, సాగు, తాగునీటికి కరువన్నదే లేకుండాపోయిందని చెప్పారు. ప్రభుత్వ మాజీ సలహాదారు విద్యాసాగర్రావు 83వ జయంతి, తెలంగాణ ఇరిగేషన్ డే వేడుకలను ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ తెలంగాణ సెంటర్, రాష్ట్ర ప్రభుత్వం, విశ్రాంత ఇంజినీర్ల సంఘం, హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్, తెలంగాణ ఇంజినీర్స్ జేఏసీ, తెలంగాణ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. తొలుత విద్యాసాగర్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఐఈఐ తెలంగాణ సెంటర్ చైర్మన్ బ్రహ్మారెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన సమావేశంలో శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో సాగు, తాగునీటి రంగాల్లో తెలంగాణ ఎదుర్కొన్న వివక్షతను వివరించారు. సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో తెలంగాణ జల మాగాణంగా మారిందన్నారు. నడివేసవిలోనూ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, చెరువులు నిండుకుండల్లా ఉన్నా యన్నారు. సాగునీటిరంగంలో ఇంజినీర్ల కృషి ఎనలేనిదని అభినందించారు.
అవార్డుల ప్రదానం
అనంతరం వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న ఇంజినీర్లకు మంత్రి శ్రీనివాస్గౌడ్ అవార్డులను ప్రదానం చేశారు. అవార్డులను స్వీకరించినవారిలో ఈఎన్సీ నాగేందర్రావు, సీఈ హమీద్ఖాన్, ఎస్ఈ విజయభాస్కర్రెడ్డి, ఈఈ రాజశేఖర్, ఈఈ సత్యనారాయణగౌడ్, ఏఈఈ సుజాత ఉన్నారు. కార్యక్రమంలో ఈఎన్సీ మురళీధర్, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే, ఆయా అసోసియేషన్ల నేతలు శ్యాంప్రసాద్రెడ్డి, తన్నీరు వెంకటేశం, రమణానాయక్, చక్రధర్, వెంకటసుబ్బయ్య, ఇరిగేషన్శాఖ ఉద్యోగులు, విశ్రాంత ఇంజినీర్లు పాల్గొన్నారు.
విద్యాసాగర్రావు సేవలు ఎనలేనవి
తెలంగాణ నీటి హక్కుల కోసం విద్యాసాగర్రావు చేసిన కృషి ఎనలేనిదని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ వీ ప్రకాశ్ పేర్కొన్నారు. ఉమ్మడి పాలకులు చూపిన వివక్షను విద్యాసాగర్రావు ఆధారాలు సహా, వ్యాసాల ద్వారా, వివిధ వేదికలపై వివరించారని గుర్తుచేశారు. సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే మాట్లాడుతూ.. విద్యాసాగర్రావు సేవలను, ఎనిమిదేండ్లలో సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతిని వివరించారు.