జగిత్యాల : జిల్లాలోని కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్ల నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో దేవాలయాల అభివృద్ధికి చిన్నచూపు చూశారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టితో యాదాద్రి, వేములవాడ దేవస్థానాలు అభివృద్ధి చెందాయని వెల్లడించారు. సీఎం ప్రత్యేక చొరవతో కొండగట్టు దశ ,దిశ మారనుందని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో వేములవాడలో పార్కింగ్ ఇబ్బందులు తప్పాయని పేర్కొన్నారు. హిందుత్వ ముసుగులో ఎంపీగా గెలిచిన బండి సంజయ్ నియోజకవర్గ అభివృద్ధికి ఒక్కపైసా కూడా తీసుకురాలేదని విమర్శించారు.
అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కొండగట్టుకు నిధులు మంజూరికి కృషి చేసిన మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ కవిత, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.