మహబూబ్ నగర్: ప్రతి ఒకక్కరిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని సుదర్శన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆజాదిక అమృత మహోత్సవం వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కస్టమర్ అవుట్ రీచ్ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
అందరి సంతోషం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. జిల్లాలో ఈ సంవత్సరం బ్యాంకుల ద్వారా 5,500 కోట్ల రూపాయల రుణాలు మంజూరు అయినట్లు మంత్రి వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి సాధించేందుకు నిరంతరం గ్రామాలలో నిధులుండేలా ముఖ్యమంత్రి వివిధ పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
గడిచిన ఐదు సంవత్సరాలలో రాష్ట్రంలోని బ్యాంకు ఉన్న ప్రతి గ్రామంలో సుమారు 25 కోట్ల రూపాయల టర్నోవర్ జరిగిందన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని బ్యాంకర్లు గ్రామాలలోని నిరుపేదలకు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, ఓసి లోని నీరు పేదలకు సహకరించాలని కోరారు.
రుణాల మంజూరులో దళారుల ప్రమేయం ఉండకూడదని, ఒకవేళ ఎవరైనా దళారీల ప్రమేయం ఉన్నట్లు అయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బ్యాంకర్లు వినియోగదారులతో గౌరవంగా, మర్యాదపూర్వకంగా మాట్లాడి వారి సమస్యలను తీర్చాలని, అప్పుడే వారు కూడా బ్యాంకులకు సహకరిస్తారని ఆయన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చే రుణాల గురించి ప్రజలకు విసృతంగా తెలియజేయాలన్నారు. కార్యక్రమలో రాష్ట్ర గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షులు బాలరాజు యాదవ్, మున్సిపల్ చైర్మన్ కె .సి. నరసింహులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి నాగరాజారావు ,మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు రాజేష్ ,వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్, సుభాష్ పాల్గొన్నారు.