హైదరాబాద్ : కంటోన్మెంట్ వాసులకు కూడా ఉచితంగా తాగునీటి సరఫరా కార్యక్రమం అమలు చేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో ఎమ్మెల్యే సాయన్నతో కలిసి వాటర్ వర్క్స్ అధికారులు, బోర్డు సీఈవో అజిత్ రెడ్డిలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 1 నుంచి ప్రతి ఇంటికి నెలకు 20 వేల లీటర్ల నీరు ఉచితంగా సరఫరా అమలులోకి వస్తుందని తెలిపారు. దీంతో ప్రతి నెల సుమారు కోటిన్నర రూపాయల ఆర్థిక భారం ప్రభుత్వం పై పడుతున్నదని చెప్పారు.
కంటోన్మెంట్ ప్రాంతంలో సుమారు 4 లక్షల మంది జనాభా ఉందని, వారికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద పేదింటి ఆడపడుచుల వివాహానికి ఆర్థిక సహాయం, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్ లు, పేదలకు ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను వర్తింప చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే కంటోన్మెంట్ అభివృద్ధి, ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపారని పేర్కొన్నారు. కంటోన్మెంట్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నప్పటికీ ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించడం లేదన్నారు.
ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులను కూడా అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయకపోవడం దుర్మార్గం అన్నారు. సమావేశంలో బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, వాటర్ వర్క్స్ ED సత్యనారాయణ, ENC కృష్ణ, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, సభ్యులు లోకనాధం, పాండు యాదవ్, నళినీ కిరణ్, అనిత ప్రభాకర్, భాగ్య శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.