హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం జలాలు రాష్ట్రం నలుదిక్కులా ప్రవహిస్తున్నాయి. నిర్విరామంగా సాగుతున్న ఎత్తిపోతలతో వివిధ ప్రాజెక్టులను దాటుకుంటూ వడివడిగా పైకి ఎగసి వస్తున్నాయి. వరదకాలువ ద్వారా శ్రీరాంసాగర్ వైపు పరుగులు పెడుతూనే.. మధ్యమానేరు, దిగువమానేరుతోపాటు అన్నపూర్ణ రిజర్వాయర్ వైపు సాగుతున్నాయి. ఎటు చూసినా ఉప్పెనలా కనిపిస్తున్న కాళేశ్వరం జలాలను చూసి.. సబ్బండవర్ణాలు సంబురపడుతున్నాయి. వరుణుడు కరుణించకపోయినా.. చినుకు రాలకపోయినా కాలువల్లో ఉప్పొంగి వస్తున్న కాళేశ్వర జలాల దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. లక్ష్మీబరాజ్ నుంచి ఇటు ఎస్సారెస్పీకి, అటు రంగనాయకసాగర్కు కాళేశ్వరం జలాల తరలింపు యథావిధిగా కొనసాతున్నది. మొత్తంగా 36 పంపుల ద్వారా కాళేశ్వర జలాలను లక్ష్మీ పంప్హౌస్ నుంచి ఎగువన ఎస్సారెస్పీకి, ఇటు దిగువన అన్నపూర్ణ వరకు జలాలను తరలిస్తున్నారు. రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అధికారులు ఎత్తిపోతలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
రంగనాయకసాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు టీఎంసీలకు చేరుకున్నది. దీంతో అన్నపూర్ణ నుంచి రంగనాయకసాగర్కు కాళేశ్వర జలాల తరలింపును నిలిపేశారు. ఇక అన్నపూర్ణ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 3.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అది కూడా మూడు టీఎంసీలకు చేరుకున్నది. ఇక రెండు రిజర్వాయర్ల నుంచి వానకాలం సాగుకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు పూర్తిగా అడుగంటిన చెరువులను నీటిని నింపుతున్నారు. మరోవైపు ప్రాణహితలో వరద స్థిరంగా కొనసాగుతున్నది. సోమవారం సాయంత్రానికి 24,800 క్యూసెక్కుల వరద వచ్చి లక్ష్మీ బరాజ్లోకి చేరుకున్నది.