సిద్దిపేట : హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్ట్కు త్వరలో తోటపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని ట్రయల్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. శనివారం గౌరవెల్లి ప్రాజెక్టును స్థానిక ఎమ్మెల్యే సతీశ్కుమార్, ప్రభుత్వ ఇంజినీరింగ్ సలహాదారు పెంటా రెడ్డి, చీఫ్ ఇంజినీర్ శంకర్తో కలిసి వినోద్ కుమార్ సందర్శించారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల దశాబ్దాల సాగునీటి కల త్వరలోనే సాకారం కానుందన్నారు.
గౌరవెల్లి ప్రాజెక్ట్ గోదావరి జలాలతో హుస్నాబాద్ నియోజకవర్గ బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయని వినోద్ కుమార్ తెలిపారు. గోదావరి జలాలతో ఈ ప్రాంత బీడు భూములు పచ్చలహారం తొడగనున్నాయని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం నుంచి మిడ్ మానేర్, అటు నుంచి తోటపల్లి రిజర్వాయర్కు.. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా గౌరవెల్లి ప్రాజెక్ట్ పంప్ హౌస్కు నీరు చేరుతుందని, భారీ మోటార్ల ద్వారా వాటిని పంపింగ్ చేయనున్నట్టు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాజెక్ట్ కేవలం 1.141 టీఎంసీ మాత్రమే ఉండగా, సీఎం కేసీఆర్ రీ-డిజైన్ చేయడంతో ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం 8.3 టీఎంసీకి పెరిగిందని, తద్వారా లక్ష ఎకరాలకు సాగనీటిని అందించేందుకు ఆస్కారం కలిగిందని వినోద్ కుమార్ తెలిపారు.
గౌరవెల్లి ప్రాజెక్ట్ పంప్ హౌస్ 130 మీటర్ల లోతులో, 17 మీటర్ల వెడల్పు, 85 మీటర్ల పొడవుతో నిర్మించారని వినోద్ కుమార్ పేర్కొన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా 90 వేల ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా 16 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టుతో అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల్లోని 15 గ్రామాలకు, కోహెడ మండలంలోని ఎనిమిది గ్రామాలకు, చిగురుమామిడి మండలంలో 10 గ్రామాలకు, భీమదేవరపల్లి మండలంలో 12 గ్రామాలు, ధర్మసాగర్ మండలంలో 13 గ్రామాలు, ఘన్పూర్ మండలంలో 10 గ్రామాలు, సైదాపూర్ మండలంలో మూడు గ్రామాలు, హనుమకొండ, జఫర్ ఘడ్, రఘునాథపల్లి మండలాల్లోని ఐదు గ్రామాలకు సాగునీరు అందుతుందని వినోద్ కుమార్ తెలిపారు.
ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేరనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురైందని, ముఖ్యంగా సాగునీటి రంగం తీవ్ర అన్యాయానికి గురి అయిందని వినోద్ కుమార్ తెలిపారు. స్వరాష్ట్రం తెలంగాణ సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్ పట్టుదలతో దూరదృష్టితో, పరిపాలనా దక్షతతో సాగునీటి రంగం చరిత్ర సృష్టించిందని వినోద్ కుమార్ వివరించారు. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా గౌరవెల్లి ప్రాజెక్టు రికార్డ్ సమయంలో పూర్తవుతోందని పేర్కొన్నారు.