Secretariat | హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): బీజేపీ నేతలు బరితెగించారు. బట్టకాల్చి మీదేయటంలో తమను మించినోళ్లు లేరనే భ్రమల్లో బతుకుతున్నారు. పిల్లి కండ్లు మూసుకుని పాలు తాగినట్టు.. లోకమంతా వారి దుర్మార్గాన్ని గమనిస్తున్న సంగతి తెలీక నానా యాగీ చేస్తున్నారు. తాజాగా ప్రపంచమే అచ్చెరువొందేలా అనతి కాలంలో అసాధారణ రీతిలో నిర్మించిన నూతన సచివాలయాన్ని తెలంగాణ ప్రభుత్వం సగర్వంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశం నలుమూలల నుంచి కేసీఆర్ పనితనానికి ప్రశంసలు వ స్తుంటే ఓర్వలేని కమలనాథులు తమ కడుపుమంటను సోషల్మీడియా వేదికగా బయటపెట్టుకున్నారు. నిజాన్ని వక్రీకరించి అభూత కల్పనలకు తెరలేపారు. వారి నిర్వాకాన్ని చూసి నిఖిల లోకం నవ్వుకుంటున్న సంగతి వారిప్పటికైనా గుర్తిస్తే మంచిది. వాస్తవం కండ్ల ముందు కనపడుతున్నా.. అబద్ధాన్ని వందసార్లు చెప్తే నిజమవుతుందన్న గోబెల్స్ ప్రచారానికి తెగబడ్డారు బీజేపీ నేతలు. వారు దుష్ప్రచారం చేసిన చిత్రం ఎంత అబద్ధమైనదో, వాస్తవ చిత్రాన్ని చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది.
ఇది అబద్ధం
ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సచివాలయ భవనంపై నీరు నిలిచిందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వర్కర్లు నీటిని తోడుతున్నట్టుగా ఉన్న ఈ వీడియో ఆధారంగా బీజేపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇదీ నిజం
వీడియోలో కనిపిస్తున్నది నూతన సచివాలయం బయట నిర్మిస్తున్న కమర్షియల్ కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. తాజా వర్షాలతో దానిపై నీరు నిలువగా, సిబ్బంది వాటిని తోడి బయటికి పంపారు. ఈ వీడియోను సచివాలయానికి ఆపాదిస్తూ కొందరు తప్పుడు ప్రచారం చేశారు.