జయశంకర్ భూపాలపల్లి, జూలై 18 (నమస్తే తెలంగాణ): కన్నెపల్లి పంప్హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసి సాగు, తాగు కోసం అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. సర్కార్ వెంటనే మేల్కొని కన్నెపల్లి పంపులను నడిపించాలని సూచించారు. శనివారం ఆయన పార్టీ నాయకులతో కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ, అన్నారం బరాజ్, కన్నెపల్లి పంప్హౌస్లను పరిశీలించారు. అనంతరం మేడిగడ్డ బరాజ్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది వర్షాలు పడకపోవడంతో సాగు, తాగునీటి సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. మేడిగడ్డ బరాజ్లో కుంగిన పిల్లర్కు మరమ్మతు చేపట్టి రైతులకు సాగునీరు అందించాలని సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు పేరుతో ప్రభుత్వం కాలయాపన చేయకుండా వెంటనే కన్నెపల్లి నుంచి అన్నారం బరాజ్కు నీటిని తరలిస్తే రాష్ట్రంలో సాగు, తాగునీటికి కరువు ఉండదని సూచించారు.