హైదరాబాద్, జూన్25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన రిజర్వాయర్లలోని నీటిమట్టాలు పాతాళానికి చేరుతున్నా యి. పెద్ద ప్రాజెక్టులే కాకుండా.. కృష్ణా, గోదావరి బేసిన్లోని మధ్యతరహా, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులదీ ఇదే పరిస్థితి. ముఖ్యంగా కృష్ణా బేసిన్లోని నీటి నిల్వల పరిస్థితి మరింత అధ్వానంగా ఉన్నది. ఎస్సారెస్పీ మరో 2టీఎంసీలను మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉన్నదని అధికారులు చెప్తున్నారు. ప్రాజెక్టులో భారీగా సిల్ట్ ఉన్న కారణంగా బురద తప్ప, వచ్చేది మరేమీ లేదని పేర్కొంటున్నారు.
ఇక ప్రాజెక్టు నుంచి తాగునీటి అవసరాలకు ప్రతి నెలా 0.5 టీఎంసీల నీళ్లు అవసరం. రాబోయే రెండు నెలలకు ఒక టీఎంసీ కావాల్సి ఉన్నది. కరీంనగర్కు ప్రధాన తాగునీటి వనరైన ఎల్ఎండీలోనూ పరిస్థితి దారుణంగా ఉన్నది. నెల క్రితమే డెడ్స్టోరేజీకి చేరుకున్నది. దీంతో కరీంనగర్ నగర ప్రజలకు మంచినీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశమున్నదని అధికారులు చెప్తున్నారు. మిడ్మానేరులోనూ పరిస్థితి ఆశాజనకంగా లేదు.
కడెం, నిజాంసాగర్లోనూ మిషన్ భగీరథకు ఈ ఏడాది నీటి కష్టాలు తప్పని పరిస్థితులు ఉన్నాయని వివరిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 41టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఈ రిజర్వాయర్ ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్తోపాటు మరో రెండు జిల్లాల తాగునీటి అవసరాలను రిజర్వాయర్ నుంచే తీర్చాల్సి ఉన్నది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై ఆధారపడి హైదరాబాద్, నాగార్జునసాగర్, నల్లగొండ, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, వైరా, ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాల్లో తాగునీటి అవసరాలు తీర్చాల్చి ఉన్నది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వలు ఇంకిపోతున్నాయి. రామప్ప, లక్నవ రం, పాకాల, మత్తడివాగు, నీల్వాయి, కిన్నెరసాని, పాలేరు, పాలెం, కోటిపల్లి, వైరా, లంకసాగర్, మూసీ, శనిగరం, రామడుగు, మల్లూరు, గుండ్లవాగు, బయ్యారం, స్వర్ణ తదితర అనేక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు డెడ్స్టోరేజీకి చేరుకున్నాయి. ఇక మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులైన చెరువులు, చెక్డ్యామ్ల్లోనూ 25శాతం మేర కూడా నీటి నిల్వలు లేవని అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టులు అడుగంటిపోవడంతో భూగర్భజల మట్టాలు ఘణనీయంగా తగ్గిపోతున్నాయి.
వివిధ ప్రాజెక్టుల్లో భా గమైన పలు రిజర్వాయర్లను మిషన్ భగీరథ పథకానికి అనుసంధానించా రు. పాలేరు, ఏకేబీఆర్, వైరా, పెండ్లిపాకల, ఉదయసముద్రం, కోయిల్సాగర్, గోపాలదిన్నె, ఎ ల్లూర్, శంకరసముద్రం, రంగసముద్రం, భీమ్ఘనపూర్, కుమ్రం భీం, మేడారం, ధర్మసాగర్, చలివాగు తదితర జలాశయాల నుంచి తాగునీటిని సరఫరా చేస్తూ వస్తున్నారు.
ప్రస్తుతం అందుకు సంబంధించిన రిజర్వాయర్లన్నీ ఇప్పటికే డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. సకాలంలో వరదలు రాకుండా పరిస్థితి ఇలాగే కొనసాగితే తాగునీటి సరఫరాకు తీవ్ర ఇబ్బందులు తలెత్తడం ఖాయమని తెలుస్తున్నది. మరోవైపు ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే తక్కువగానే వానలు కురిసే అవకాశమున్నదని వా తావరణ శాఖ అంచనా వేస్తున్నది. అయినప్పటికీ సర్కార్ ఎలాంటి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయకపోవడం శోచనీయం.
