కూసుమంచి, జూలై 21: సమైక్య పాలనలో ఒక్క పంటకే సాగునీరు అందక పంటలు ఎండిన పరిస్థితి నుంచి స్వరాష్ట్రంలో రెండు పంటలకు పుష్కలంగా సాగునీటిని అందించే విధంగా సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. గురువారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జలాశయం నుంచి స్థానిక ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డితో కలిసి ఆయకట్టు రైతులకు సాగునీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో సాగర్కు నీరు రావాలంటే ఎగువన అన్ని ప్రాజెక్టులు నిండి ఆంధ్రాకు నీరు వదిలిన తరువాతే తెలంగాణాకు నీరు విడుదల చేసేవారన్నారు. ఖమ్మం జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు సాగర్ జలాలు అందిస్తామని, రైతులు నీటిని వృథా చేయకుండా పంటలకు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్యెల్యే సండ్ర వెంకటవీరయ్య, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు తదితరులు పాల్గొన్నారు.