సిరిసిల్ల రూరల్, మార్చి 23: కాళేశ్వర జలాలతో మెట్ట ప్రాంతమైన సిరిసిల్లలోని చెరువులకు జలకళ వచ్చింది. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని పెద్దచెరువు, పటేల్ చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి. మంత్రి కేటీఆర్ చొరవతో కాళేశ్వర జలాలు రంగనాయక సాగర్ ప్రాజెక్టు కాలువల ద్వారా జిల్లెల్ల చెరువులు నిండి, దిగువకు పారుతున్నాయి.
దీంతో పటేల్ చెరువు మత్తడి వద్ద సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాట్ల మధు ఆధ్వర్యంలో గురువారం జిల్లెల్ల ప్రజాప్రతినిధులు, నేతలు, రైతులు సంబురాలు జరుపుకొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీపై పూలు చల్లి పాలతో అభిషేకించారు. సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని, కాళేశ్వర జలాలతో చెరువులు నింపుతున్నారని కొనియాడారు. దశాబ్దాల కల నేరవేరిందని ఆనందపడ్డారు.