సూర్యాపేట, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : వారంటీ, గ్యారెంటీలు ఇచ్చి కర్ణాటక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణను సైతం ఆగం చేయాలనే బఫూన్లను తలపించేలా హామీలు గుమ్మరిస్తున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా ఇవ్వని పథకాలను ఇక్కడ ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. వారి హామీలు బోగస్, వారి మాటలు ఆచరణ సాధ్యం కానివని ప్రజలే నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
సోమవారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తాము అధికారంలోకి రావడం కష్టతరమేనని గుర్తించడం వల్లే కాంగ్రెస్ తుక్కుగూడ హామీలు అన్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలని రాష్ట్రంలో కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను కాపీ చేసి ప్రజలను మోసం చేయాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారని విమర్శించారు. సమావేశంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.