Warangal Super Speciality Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన..! ఈ కల త్వరలోనే సాకారం కాబోతున్నది. అత్యద్భుత రీతిలో దేశంలోనే అతిపెద్ద దవాఖానగా సాక్షాత్కరించబోతున్నది. వచ్చే దసరా కల్లా నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు వేగం పుంజుకున్నాయి. రోజుకు మూడు షిఫ్టుల్లో కొనసాగుతున్న పనులు తెలంగాణ పునర్నిర్మాణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉన్న పట్టుదల, దీక్షను కండ్లకు కడుతున్నాయి.
వరంగల్, మే 15 (నమస్తే తెలంగాణ): వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణ పనులు రేయంబవళ్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మూడు షిప్టుల్లో 1,200 మంది కార్మికులు పనిచేస్తుండగా ఈ సంఖ్యను త్వరలో మూడు వేలకు పెంచనున్నారు. 110 మంది ఇంజినీర్లు పర్యవేక్షిస్తున్నారు. దసరాలోగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో యుద్ధప్రాతిపదిక పనుల్లో వేగం పెంచారు. వరంగల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,116 కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం చేపట్టింది. దేశంలోనే అతిపెద్ద దవాఖాన కాబోతుండటం దీని ప్రత్యేకత.
వరంగల్లోని సెంట్రల్ జైల్ స్థలం నుంచి దవాఖాన నిర్మాణం కోసం ప్రభు త్వం 56.39 ఎకరాలు కేటాయించింది. ఇందులో సుమారు 42.42 ఎకరాల విస్తీర్ణంలో మొదట రెండు వేల పడుకల సామర్థ్యంతో 24 అంతస్థుల సూపర్ స్పెషాలిటీ నిర్మాణానికి రహదారులు, భవనాల (ఆర్అండ్బీ) శాఖ ఇంజినీర్లు డిజైన్ చేశారు. టెండర్ల ప్రక్రియలో నిర్మాణ పనులను ఈపీసీ మోడ్లో ఎల్అండ్టీ సంస్థ దక్కించుకున్నది. 18 నెలల కాల పరిమితితో నిర్మాణ పనులను పూర్తి చేయడానికి గత సంవత్సరం మే 8న ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది.
2023 నవంబర్ 8లోగా పూర్తి చేసే లక్ష్యంతో ఎల్అండ్టీ సంస్థ గత మేలో నిర్మాణ పనులను ప్రారంభించింది. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు నిర్మాణ పనులపై ఉన్నతస్థాయి సమీక్ష జరుపుతూ సూచనలు చేస్తున్నారు. మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, వేముల ప్రశాంత్రెడ్డి పలుమార్లు నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు. వచ్చే దసరాలోగా నిర్మాణ పనులను పూర్తిచేయాలని మంత్రి హరీశ్రావు కొద్దిరోజుల క్రితం హైదరాబాద్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు. తెలంగాణలో అతిపెద్ద దవాఖాన రాబోతున్నదంటూ మంత్రి కేటీఆర్ కొద్దిరోజుల క్రితం వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్చేశారు. ఈ నేపథ్యంలో నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది.
పడకల సామర్థ్యం పెంపు
సీఎం కేసీఆర్ గత అక్టోబర్ 1న వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖానను సందర్శించి, నిర్మాణ పనులను పరిశీలించారు. తాను సూచించిన రీతిలో నిర్మాణం జరగడం లేదని ఒకింత అసహనం వ్యక్తంచేశారు. ఆ తరువాత హైదరాబాద్లో ఈ దవాఖాన నిర్మాణ పనులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశా రు. సీఎం కేసీఆర్ సూచనలకు అనుగుణంగా ఆర్అండ్ బీ ఇంజినీర్లు పలు మార్పులు చేశారు. దీంతో దవాఖాన పడకల సామర్థ్యం రెండు వేల నుంచి 2,458కి పెరిగింది. దీనితోపాటు దవాఖాన నిర్మాణానికి ప్లింత్ ఏరి యా కూడా పెరిగింది. మొదట రెండు వేల పడుకలతో 24 అంతస్థుల్లో 16,55,923 చదరపు అడుగుల ప్లింత్ ఏరియాతో నిర్మించేందుకు ఆర్అండ్బీ ఇంజినీర్లు డిజైన్ చేశారు. ప్రస్తుతం ప్లింత్ ఏరియా కూడా 19,83,172 చదరపు అడుగులకు చేరింది.
సీఎం కేసీఆర్ సందర్శనకు ముందు అధికారులు దవాఖాన ముందు భాగంలో ఎమర్జెన్సీ, వెనుక భాగంలో ఓపీటీ వద్ద మాత్రమే పోర్టికో నిర్మించేందుకు డిజైన్ చేశారు. సీఎం కేసీఆర్ సూచనలతో దవాఖాన చుట్టూ రెండు అంతస్తుల ఎత్తు వరకు పోర్టికో నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. హాస్పిటల్ బ్లాక్ను ఆనుకుని కూడా అదనంగా భవన నిర్మాణ పనులను చేపట్టారు. ఎలక్ట్రిఫికేషన్, ప్లంబింగ్ పనులు కూడా మొదలయ్యాయి. యుటిలిటీ వంటి బ్లాక్లో కీలకమైన నిర్మాణ పనులు పూర్తి కావడంతో కొద్దిరోజుల నుంచి పెయింటింగ్ పనులు చేస్తున్నారు. ఇటీవల దవాఖాన ఆవరణలో డ్రైనేజీ, గార్డెన్, రహదారులతోపాటు ఇతర నిర్మాణ పనులను కూడా చేపట్టారు.