హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 16: వరంగల్ నిట్ 21వ కాన్వొకేషన్ శనివారం సంబురంగా జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి నీతి ఆయోగ్ సభ్యుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ విజయ్కుమార్ సారస్వత్, నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ బ్రాంచీల్లోని 8 మందికి గోల్డ్మెడల్స్, 2,029 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. అనంతరం సారస్వత్ మాట్లాడుతూ.. దేశంలోని విశిష్ట సంస్థల్లో వరంగల్ నిట్ ఒకటని పేర్కొన్నారు. ఈ సంస్థ కాన్వొకేషన్లో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు.
దేశంలోనే ఇది మొదటి ప్రాంతీయ ఇంజినీరింగ్ కళాశాల(ఆర్ఈసీ) అని తెలిపారు. 64 ఏండ్లుగా ఈ సంస్థ.. దేశ సాంకేతిక, సామాజిక, ఆర్థిక అవసరాలను తీర్చడంలో తోడ్పడుతున్నదని వివరించారు. విద్య, శిక్షణలో సంస్థ ఉన్నత ప్రమాణాలను కొనసాగించడం అత్యంత సంతోషకరమని పేర్కొన్నారు. పాత తరంలో చాలా మందికి ఈ అవకాశం లేదని చెప్పారు. భారతదేశం ఇప్పటికే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నదని, ఇస్రో చంద్రయాన్-3 ల్యాండర్ను చంద్రుడిపై సురక్షితంగా దింపడం, ఆదిత్య ఎల్-1 ప్రయోగం ఇందుకు నిదర్శనమని తెలిపారు.