హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ ) : బీఆర్ఎస్ రజతోత్సవ సభను కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేస్తామని ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు ప్రతినబూనారు. కేసీఆర్ పరిపాలనను తిరిగి రాష్ట్ర ప్రజలకు అందిస్తామని శపథం చేశారు. తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు, వరంగల్లో కాకతీయ టెక్స్టైల్ పార్క్, చెరువుల పునరుద్ధరణకు మిషన్ కాకతీయ పేరుపెట్టడం, రాజముద్రలో కాకతీయ కళాతోరణం ఏర్పాటు వంటివి కేసీఆర్ హయాంలోనే సాధ్యమైందని సంతోషం వ్యక్తంచేశారు. ఈ నెల 27న వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లా ముఖ్య నేతలు ఎర్రవెల్లి నివాసంలో పార్టీ అధినేత కేసీఆర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సభ నిర్వహణ, ఏర్పాట్లపై కేసీఆర్తో చర్చించారు. పార్టీ అధినేత నుంచి పలు సలహాలు, సూచనలు స్వీకరించారు. రజతోత్సవ మహాసభ బాధ్యతలను తమ జిల్లాకు అప్పగించినందుకు కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు తకళ్లపల్లి రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, తాటికొండ రాజయ్య, సత్యవతిరాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, దాస్యం వినయ్భాసర్, చల్లా ధర్మారెడ్డి, డీఎస్ రెడ్యానాయక్, శంకర్నాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపునేని నరేందర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్రావు, గండ్ర జ్యోతి, నాగజ్యోతి తదితర జిల్లా ముఖ్యనేతలతోపాటు మాజీ ఎంపీ సంతోష్కుమార్, మాజీ ఎమ్మెల్యే ఏ జీవన్రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వంశీధర్రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వరంగల్ జిల్లా నేతలు మాట్లాడుతూ, బీఆర్ఎస్ అధినేత ఆదేశాలతో ఉద్యమ సమయంలో కూడా అనేక భారీ సభలను సమర్థంగా నిర్వహించి విజయవంతం చేశామని చెప్పారు. వరంగల్లో సభ నిర్వహణ పార్టీకి కలిసొచ్చే అంశమని ఆనందం వ్యక్తంచేశారు. ఇప్పటికే వరంగల్ సమీపంలోని ఎలతుర్తి వద్ద 1,213 ఎకరాల స్థలాన్ని రజతోత్సవ మహాసభ నిర్వహణ కోసం తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఇందులో 154 ఎకరాలు మహాసభ ప్రాంగణం ఉంటుందని చెప్పారు. పారింగ్ కోసం 1,059 ఎకరాలు కేటాయించామని, ఇందులో దాదాపు 50,000 వాహనాలను పారింగ్ చేసుకునే వీలుంటుందని తెలిపారు. కనీవినీ ఎరుగని రీతిలో మహాసభను నిర్వహిస్తామని, రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు, తెలంగాణవాదులు, ప్రజలు భారీ ఎత్తున తరలివస్తారని చెప్పారు. సభకు తరలివచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 10 లక్షల నీళ్ల బాటిళ్లను సిద్ధంగా ఉంచనున్నట్టు వివరించారు. ట్రాఫిక్ తదితర ఏర్పాట్లకు ఎటువంటి ఆటంకం కలగకుండా 1,500 మంది వలంటీర్లతోపాటు అత్యవసర వైద్యసేవలను, అంబులెన్స్లను అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన శాంతియుత పోరాటంలో అనేక సభలను నిర్వహించుకున్న ఘనత వరంగల్ గడ్డకు ఉన్నదని ఆ జిల్లా నేతలు తెలిపారు. ఉద్యమ సమయంలో నిర్వహించిన విశ్వరూప మహాసభ విజయవంతమైన స్ఫూర్తితో రజతోత్సవ మహాసభను కూడా విజయవంతం చేస్తామని ధీమా వ్యక్తంచేశారు. వరంగల్ గడ్డ ముద్దుబిడ్డలు మహాకవి కాళోజీ నారాయణరావు, తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అర్పించిన ప్రొఫెసర్ జయశంకర్ అందించిన ఉద్యమ స్ఫూర్తితో తిరిగి పార్టీ కోసం, ప్రజల కోసం తమ కార్యాచరణను అమలు చేస్తామని చెప్పారు.
ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నిర్వహించనున్న నేపథ్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లా ముఖ్యనేతలు పార్టీ అధినేత కేసీఆర్తో ఎర్రవెల్లి నివాసంలో సమావేశమయ్యారు. సభ నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించారు. రజతోత్సవ మహాసభ బాధ్యతలను తమ జిల్లాకు అప్పగించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎలతుర్తి వద్ద 1,213 ఎకరాల స్థలాన్ని మహాసభ నిర్వహణ కోసం తీర్చిదిద్దుతున్నామని వారు వివరించారు. ఏర్పాట్లకు సంబంధించి అధినేత నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సమావేశంలో పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారితోపాటు వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, రాష్ట్రస్థాయి ముఖ్యనేతలు పాల్గొన్నారు.
సాగునీటి ప్రాజెక్టులైన కాళేశ్వరం, దేవాదులను పూర్తిచేయడం, సమ్మక బరాజ్ నిర్మాణం, హైదరాబాద్ తర్వాత వరంగల్ను తొలి ద్వితీయ శ్రేణి ఐటి నగరంగా తీర్చిదిద్దడం, కాళోజీ కళాకేంద్రం నిర్మాణం, వరంగల్కు పోలీస్ కమిషనరేట్ హోదా కల్పించడం కేసీఆర్ ప్రభుత్వ ఘనతలని వరంగల్ జిల్లా నేతలు వివరించారు. తిరిగి కేసీఆర్ పాలనను తెలంగాణ ప్రజలకు అందించడం ద్వారా వరంగల్ జిల్లా కేసీఆర్ రుణం తీర్చుకుంటుందని చెప్పారు. కేసీఆర్ను తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకొని, గాడితప్పిన రైతన్నల సంక్షేమాన్ని, అభివృద్ధిని గాడిలో పెట్టడానికి వరంగల్ జిల్లా బిడ్డలుగా ముందు వరుసలో ఉంటామని ప్రతినబూనారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి, అధినేతకు బహుమతిగా అందజేస్తామని చెప్పారు.
తెలంగాణకైనా, వరంగల్ కైనా కేసీఆరే శ్రీరామరక్ష అనే విషయం మరోసారి నిరూపితమైందని వరంగల్ నేతలు పేర్కొన్నారు. పదేండ్ల పాలనలో ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని గుర్తుచేశారు. రెండు వేల ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్ను ఏర్పాటుచేసి, తెలంగాణ నేతన్నలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ వస్త్ర పరిశ్రమకు ఊతమిచ్చే దిశగా చర్యలు చేపట్టారని తెలిపారు. హైదరాబాద్లో ఉన్న సూపర్ స్పెషాలిటీ దవాఖానాలకు పోటీనిచ్చే రీతిలో వరంగల్లో 24 అంతస్థుల మల్టీ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం బీఆర్ఎస్ హయాంలోనే ప్రారంభం కావడం గొప్ప విషయమని చెప్పారు. వరంగల్ను స్మార్ట్సిటీగా అభివృద్ధి చేయడంతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేసినట్టు వివరించారు. హైదరాబాద్తో పోటీపడే విధంగా వరంగల్, హనుమకొండ జంట నగరాలను అభివృద్ధి చేస్తూనే, జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు అభివృద్ధిని విస్తరించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.