వరంగల్ : ప్రపంచంలో వ్యవసాయ రంగానికి నీటి ప్రాముఖ్యతను చాటిన నేల ఓరుగల్లు అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వరంగల్ కోడెం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల వానాకాలం పంటల అవగాహన సదస్సుకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..11వ శతాబ్దంలోనే గొలుసుకట్టు చెరువులు, కుంటలు, ప్రముఖ ఆలయాలను కాకతీయ రాజులు నిర్మించి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారన్నారు. కాకతీయుల స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ పథకాన్ని రూపొందించారని గుర్తు చేశారు. ప్రపంచంలోని ఆధునిక ప్రాజెక్టులకు భిన్నంగా పారే నీళ్లు ఎదురెక్కేలా సీఎం కేసీఆర్ ప్రపంచంలో అతి పెద్ద కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నారని తెలిపారు.
రైతుకు రైతుబంధు పథకం ద్వారా ఎదురు పెట్టుబడి ఇస్తూ..సీఎం అన్నదాతలకు అండగా నిలుస్తున్నారన్నారు. ఏది పండించాలి ? ఏది పండించకూడదు? అని తెలుసుకుని సాగు చేస్తే అది లాభసాటి వ్యవసాయం అవుతుందన్నారు. 5 శాతం మాత్రమే జీవరాశి జీవించగలిగే ఈజిప్ట్ లో కోటి ఎకరాలలో భూమి మాత్రమే సాగవుతుంది. అక్కడ ప్రభుత్వమే ఏ పంటలు పండించాలో రైతులకు నిర్దేశిస్తుంది.ఆ ప్రకారమే వారు పంటలు పండిస్తున్నారని పేర్కొన్నారు.
మన దేశంలో గోధుమల ఎగుమతిని ప్రధాని మోదీ నిలిపివేశారు. చిన్న, చిన్న దేశాలు ఇతర దేశాలకు వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు చేస్తుంటే .. దాదాపు 40 కోట్ల ఎకరాల సాగుభూమి ఉన్న మన దేశం ఎగుమతులను నిషేధించడం గమనార్హం. ఈ పరిస్థితిని రైతులకు తెలియజెప్పి చైతన్యం చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతు వేదికలలో నిరంతరం రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. ఆధునిక వ్యవసాయం, ఎరువులు, పురుగుమందుల యాజమాన్య పద్ధతులు వంటి వాటిపై చైతన్యం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆయిల్ పామ్ సాగు విషయంలో రైతులను చైతన్యం చేయడంలో విజయవంతం అయ్యాం. ఉద్యాన, కాయగూరల్లో విభిన్న పంటల సాగుపై రైతులు దృష్టిసారించాలి. అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న తోతాపురి మామిడి, జామ, నిమ్మ, బత్తాయి, అరటి సాగు వైపు ఉద్యానశాఖ రైతులను ప్రోత్సహించాలన్నారు. కాంగ్రెస్,బీజేపీ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. ప్రధాని మోదీ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు పూనుకున్నారన్నారు.
వ్యవసాయం ఆగిపోతే ప్రపంచం అంతరిస్తుంది. వ్యవసాయం బాగుండాలి. అన్నదాతలను గౌరవించాలని మంత్రి అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఎంపీలు కవిత, దయాకర్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్, వెంకటరమణ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్ ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, బండ ప్రకాష్ ముదిరాజ్, జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్లు గోపి, శశాంక్, భవేష్ మిశ్రా, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి తదితరులు ఉన్నారు.