హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముందు బీజేపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. జీహెచ్ఎంసీకి చెందిన పలువురు బీజేపీ కార్పొరేటర్లు నిన్న కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇవాళ వరంగల్కు చెందిన ఓ బీజేపీ కార్పొరేటర్, ఇతర నాయకులు గులాబీ గూటికి చేరారు.
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆద్వర్యంలో వరంగల్ 27వ డివిజన్ కార్పోరేటర్ చింతాకుల అనిల్, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చింతాకుల సునీల్ టీఆర్ఎస్లో చేరారు. వీరందరికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక, తెలంగాణపై ఆయన చూపుతున్న వివక్షకు నిరసనగా బీజేపీని వీడినట్లు వారు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణా అభివృద్ది సాధ్యమని తాము నమ్ముతున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బండా ప్రకాష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ టీ రమేష్ బాబు, టీఆర్ఎస్ నాయకుడు గందె నవీన్, ఇతర నాయకులు పాల్గొన్నారు.