హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను తేల్చడంలో కేంద్ర ప్రభుత్వం కావాలనే తాత్సారం చేస్తున్నదని మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు. నీటి వాటాను తేల్చకుండా తెలంగాణ ప్రజలను ఓట్లడిగే నైతిక హక్కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి లేదని అన్నారు. సోమవారం ఆయన నూతన సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఆదిలాబాద్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
మోదీ సర్కారు కృష్ణా జలాల్లో నీటి వాటాను ఎందుకు తేల్చడం లేదని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదాను ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలది అవినీతి, బంధుప్రీతి అని విమర్శించడం విడ్డూరంగా ఉన్నదని మండిపడ్డారు. తెలంగాణపై కేంద్రం కక్ష సాధిస్తున్నదని, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చుతున్నదని విమర్శించారు. రామరాజ్యం అంటూ ఊదరగొడుతున్న మోదీ సర్కారు.. ఆ రీతిలో ఎందుకు పాలన సాగించడం లేదని మంత్రి జూపల్లి నిలదీశారు.