పాలమూరు జిల్లా.. అందులో వనపర్తి.. ఎనిమిదేండ్ల కిందటివరకు ఈ జిల్లాలో నవ్వు ముఖాలు చూస్తమని అనుకొన్నమా? వలసలు తప్ప ఉపాధిలేని బతుకులు మళ్లీ చిగురిస్తయని అనుకొన్నమా? స్వరాష్ట్రం రావటం వల్ల ప్రయోజనమేమిటి అని అడిగితే.. వనపర్తిని చూపిస్తే చాలు. స్వపరిపాలనలో జిల్లాగా మారిన వనపర్తి.. బంగారు పంటల ఖిల్లాగా అభివృద్ధి చెందింది. ఒకనాడు 30 వేల ఎకరాలు కూడా లేని ఆయకట్టు.. 3 లక్షల ఎకరాలకు విస్తరించింది. వలసపోయిన పక్షులన్నీ.. సొంతగూటికి తిరిగి చేరుకొన్నాయి. తాము పనిచేసుకోవడమే కాకుండా.. పక్క రాష్ర్టాల వారికి కూడా పని కల్పించడం వనపర్తి జిల్లా రైతులకు ఇవాళ్టికీ కలగానే అనిపిస్తున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు స్థానికంగా తమ ప్రతినిధి మంత్రి నిరంజన్రెడ్డికి మనసునిండా కృతజ్ఞతలు చెప్తున్నారు. ఈ నెల 8న వనపర్తిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు కేసీఆర్ వస్తున్న తరుణంలో గడిచిన ఎనిమిదేండ్లలో వనపర్తి జిల్లాలో జరిగిన అభివృద్ధిపై ప్రత్యేక కథనం.
మహబూబ్నగర్, మార్చి 6 : తెలంగాణ ఏర్పడేనాటికి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనీసం లక్ష ఎకరాలకు కూడా సాగునీరు అందని దుస్థితి. వనపర్తి ప్రాంతం మీదుగా కృష్ణానది ప్రవహిస్తున్నా పదివేల ఎకరాలకు మించి సాగయ్యేది కాదు. సమైక్య పాలనలో ఇక్కడి ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవడంతో వ్యవసాయం ఆగమైంది. ప్రజలు పొట్టచేత పట్టుకొని బొంబాయి, హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. ఇప్పుడు స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో వనపర్తి జిల్లా ఊహకందనంతగా రూపుమారింది. ఇక్కడినుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ముందుచూపుతో అతితక్కువ కాలంలోనే జిల్లా కొత్తరూపు సంతరించుకొన్నది.
కృష్ణానదిపై చేపట్టిన మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల (ఎంజీకేఎల్ఐ) పనులను 2003లో ప్రారంభించారు. సమైక్య రాష్ట్రంలో 21 ఏండ్లలో ప్రాజెక్టు కోసం ఖర్చు చేసింది కేవలం రూ.2496.205 కోట్లు. అరకొర కేటాయింపులతో పనులన్నీ అసంపూర్తిగా మిగిలాయి. ఎంజీకేఎల్ఐ ప్రధాన కాలువకు 60 మీటర్ల దిగువన ఉన్నా నాటి పాలకుల నిర్లక్ష్యం కారణంగా వనపర్తిని ఎంజీకేఎల్ఐ ఆయకట్టు కింద చేర్చలేదు. స్వరాష్ట్రంలో మంత్రి నిరంజన్రెడ్డి చొరవతో సీఎం కేసీఆర్ ఎంజీకేఎల్ఐకు అదనంగా 25 టీఎంసీలను కేటాయించి మొత్తం కేటాయింపులు 40 టీఎంసీలకు పెంచారు. పెండింగ్ పనులు అన్నీ పూర్తిచేసి 5 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చారు. ఘణపురం బ్రాంచ్ కెనాల్, పెద్దమందడి బ్రాంచ్ కెనాల్ పనులను రికార్డు సమయంలో పూర్తిచేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో భాగంగా నిర్మిస్తున్న 7 టీఎంసీల సామర్థ్యమున్న ఏదుల రిజర్వాయర్ను కేవలం 23 నెలల కాలంలో నిర్మించారు. శంకర సముద్రంలో రింగ్ బండ్ నిర్మించి వనపర్తి, శ్రీరంగాపురం, చిన్నంబావి, వీపనగండ్ల, పాన్గల్ మండలాల్లో 48 వేల ఎకరాలకు సాగునీరు తీసుకువచ్చారు. భీమా నుంచి రూ.2 కోట్లతో వెల్టూరుకు లింకు కెనాల్, మరో 4 గ్రామాలకు సాగునీటి కాలువ ఏర్పాటు చేశారు. భీమా ద్వారా వనపర్తి జిల్లాలో 87,664 ఎకరాలు, జూరాల ద్వారా 63,500 ఎకరాలు, చిన్న నీటి పారుదల ద్వారా 66,402 ఎకరాలకు, 58 మినీ ఎత్తిపోతల పథకాలతో 5500 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. నాడు 30 వేల ఎకరాలున్న ఆయకట్టు కాస్త ఇప్పుడు 3,14,892 ఎకరాలకు చేరుకొన్నది.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తున్నా సాగు, తాగునీటికి ప్రజలు పడుతున్న బాధలు చూసి స్థానికుడిగా ఎంతో ఆవేదన చెందేవాడిని. వనపర్తి సమీపంలోనే ఎంజీకేఎల్ఐ ప్రధాన కాలువ వెళ్తున్నా దిగువన ఉన్న ప్రాంతానికి సాగునీరు వచ్చేది కాదు. కానీ, సీఎం కేసీఆర్ సహకారంతో మంత్రి నిరంజన్రెడ్డి చక్కని ప్రణాళికతో బీడు భూములకు సాగునీరు వచ్చేలా ప్రయత్నం చేశారు. ఫలితంగా ఆయకట్టు 3 లక్షల ఎకరాలకు చేరుకొన్నది. ఇప్పుడు ప్రాజెక్టుల కింద సుమారు 10 లక్షల పైచిలుకు ఎకరాలు సాగువుతున్నది. స్థానికునిగా ప్రాజెక్టుల పరిధిలో పనిచేసే ఇంజినీర్గా ఇది ఎంతో ఆత్మ సంతృప్తిని కలిగిస్తున్నది. సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్రెడ్డి వల్లే ఇది సాధ్యమైంది. ‘
– సత్యనారాయణ గౌడ్, డీఈఈ
తెలంగాణ ఏర్పడే నాటికి జూరాల కింద పెబ్బేరు మండలంలో కొన్ని గ్రామాలు మినహా సాగునీటి సదుపాయం లేదు. ఇక్కడి ప్రజలు బతుకుదెరువు కోసం బొంబాయి, హైదరాబాద్ నగరాలకు వలస వెళ్లేవారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు గత పాలకులు కనీస ప్రయత్నం కూడా చేయలేదు. తెలంగాణ వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి కల్వకుర్తి ఆయకట్టు కిందకు చేర్చి గణపురం, పెద్దమందడి, బుద్దారం, భీమా కాలువల ద్వారా, 58 మినీ ఎత్తిపోతల పథకాల ద్వారా నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు పైగా, జిల్లాలో 3 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాం. మరో 50 వేల ఎకరాలకు నీళ్లు తెచ్చే పనులు కొనసాగుతున్నాయి. సాగునీటి రాకతో వలసలు ఆగిపోయాయి. స్థానికంగా ఉపాధి అవకాశాలు, వర్తక, వాణిజ్యం పెద్ద ఎత్తున పెరిగాయి. వ్యవసా య భూముల రిజిస్ట్రేషన్లలో వనపర్తి ప్రాంతం రాష్ట్రంలో అగ్రభాగాన నిలుస్తున్నది. ఇతర ప్రాంతాల వారు పనుల కోసం ఇక్కడికి వలస వస్తున్నారు. ప్రజల సహకారం, సీఎం కేసీఆర్ అండతో వనపర్తిని రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో నిలబెట్టాం.
– సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి
వనపర్తి ప్రాంతంలో వేసవి వచ్చిందంటే తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యేవి. జూరాల నుంచి రామన్పాడు పైప్ లైన్ ఉన్నా వేసవిలో నీటి లభ్యత లేక ప్రజలు తాగునీటికి అవస్థలు పడేవారు. వనపర్తి పట్టణానికి తాగునీటి సమస్య తీర్చేందుకు సీఎం కేసీఆర్ రూ.300 కోట్లు కేటాయించారు. మిషన్ భగీరథ ద్వారా ప్రత్యేక పైపులైన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.