Wanaparthy | చుట్టు కొండలు, గుట్టల మధ్యన ఉండే వనపర్తిని ఉమ్మడి పాలకులు పట్టించుకోలేదు. సాగు, తాగునీరు ఇవ్వలేదు. దీంతో ప్రజలు ముంబైకి వలస వెళ్లేవారు. బీఆర్ఎస్ పాలనలో వనపర్తి అభివృద్ధికి అడ్డాగా మారింది. జిల్లాగా మారడంతో మహర్దశ పట్టింది. సాగునీటి రాకతో పాడిపంటల నెలవైంది.
వనపర్తి, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): జిల్లా కేంద్రంగా మారడంతో వనపర్తి దశ తిరిగింది. ఎడ్యుకేషన్ హబ్గా మారింది. మినీలిఫ్ట్లు, కాల్వలతో సాగునీటి రాకతో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారింది. 62 కోట్లతో 25 ఎకరాల్లో సమీకృత కలెక్టరేట్ నిర్మించారు. 34 ప్రధాన ప్రభుత్వ విభాగాలశాఖలు ఒకేచోట కొలువుదీరాయి. 38.50 కోట్లతో 29 ఎకరాల్లో ఎస్పీ కార్యాలయాన్ని నిర్మించారు. వనపర్తి శివారులో రూ.550 కోట్లతో 50 ఎకరాల్లో మెడికల్ కాలేజీ నిర్మించారు. జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను రూ.40 కోట్లతో 45 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. పెబ్బేరులో 65 ఎకరాల్లో రూ.65 కోట్లతో తొలి మత్స్యకళాశాలను ఏర్పాటు చేయించారు. వ్యవసాయ డిగ్రీ మహిళా కళాశాల, మహాత్మా జ్యోతిబాఫూలే మహిళా కళాశాలను తీసుకొచ్చారు. మినీలిఫ్ట్లతోపాటు లింక్ కెనాల్లు, భీమా ఫేజ్-2తో మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సాగునీటికి ఢోకాలేకుండా చేశారు. బుద్దసముద్రం, గణపసముద్రం చెరువులను రిజర్వాయర్లుగా మార్చారు. తాజాగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో భాగంగా ఏదుల రిజర్వాయర్ను నిర్మించారు. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా వయాడక్ట్ నిర్మించి తండాల గుట్టలపైకి నీళ్లను ఎక్కించి సాగుకు యోగ్యం చేశారు. సాగులో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ వానకాలం సీజన్లో 1.86 లక్షల ఎకరాల్లో వరి సాగైంది.
పెబ్బేరు మండలంలో కొంతభాగం మిన హా మిగతా ప్రాంతమంతా సాగునీటి వసతు లు లేవు. గత ఐదేండ్లలో మిగిలిన మండలాల కు ఎంజీకేఎల్ఐ ద్వారా సాగునీరందేలా నిరంజన్రెడ్డి చర్యలు చేపట్టారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని 3 మండలాలకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి నీటి వసతులు సమకూర్చారు. కొత్తకోట, మదనాపురానికి బీమా, ఎంజీకేఎల్ఐ నీటిని అందించడంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సఫలీకృతమయ్యారు. మక్తల్ పరిధిలోని 2 మండలాలకు జూరాల నుంచి సాగు నీరందించడంలో ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి కృషిచేశారు. సాగునీటి వసతుల్లో వనపర్తి జిల్లా నంబర్వన్గా నిలిచింది.