హిమాయత్నగర్, జూలై 13 : ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్, కార్పొరేట్ వారికి కట్టబెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ అన్నారు. బుధవారం హైదరాబాద్ హిమాయత్నగర్లోని ఎస్ఎన్ రెడ్డి భవన్లో ఆయన మాట్లాడుతూ.. మోదీ సర్కారుకు డబ్బుపై ఉన్న మక్కువ ప్రజలపై లేదని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీలకు 5జీ అమ్మకాన్ని రద్దు చేసి బీఎస్ఎన్ఎల్కు కేటాయించాలని డిమాండ్ చేశారు. దేశసంపద కొంతమంది చేతిలో బందీ కావొద్దని, అది అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం వినియోగించాలని ఆయన ప్రభుత్వాలను కోరారు. కేంద్రం విధానాలను వ్యతిరేస్తూ కార్మిక వర్గం పోరాడాలని బోస్ పిలుపునిచ్చారు.