హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వీఆర్ఏలు సమ్మె విరమించారు. గురువారం నుంచి విధులకు హాజరవుతామని ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నిక అనంతరం సమస్యలను తప్పక పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నట్టు వెల్లడించారు. బుధవారం బీఆర్కే భవన్లోని తన కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, సీసీఎల్ఏ డైరెక్టర్ రజత్కుమార్ సైనీ సమక్షంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రెసా), వీఆర్ఏల జేఏపీ ప్రతినిధులతో 40 నిమిషాలకు పైగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ వీఆర్ఏల డిమాండ్లపై ప్రభుత్వం సానుభూతితో ఉన్నదని స్పష్టంచేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎత్తివేయగానే సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు.
వీఆర్ఏలు కోరుతున్న వాటిలో ముఖ్యంగా అర్హత ప్రాతిపదికన పదోన్నతులు కల్పించడం, పే స్కేలు ఇవ్వడం, వయసు పైపడిన వారి డిపెండెంట్లకు ఉద్యోగం ఇవ్వడంతోపాటు సమ్మె కాలానికి వేతనం, సమ్మె కాలంలో పెట్టిన పోలీసు కేసుల ఉపసంహరణ, చనిపోయిన వీఆర్ఏల కుటుంబాలకు ఎక్స్గ్రేషియాతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వంటివి ఉన్నాయి. వీటిపై సుదీర్ఘంగా చర్చించిన సోమేశ్కుమార్.. కోడ్ ముగియగానే అన్నింటినీ పరిష్కరిస్తామని హామీఇచ్చారు. దీంతో వీఆర్ఏలు తిరిగి విధుల్లోకి చేరుతున్నట్టు ప్రకటించారు. సమావేశంలో ట్రెసా నేతలు వంగా రవీందర్రెడ్డి, గౌతమ్కుమార్, వీఆర్ఏ జేఏసీ నేతలు రమేశ్ బహదూర్, దాదే మియా, సాయన్న, వంగూరు రాములు, వెంకటేశ్యాదవ్, సీఐటీయూ నేతలు పాలడుగు భాసర్, వెంకటేశ్ పాల్గొన్నారు.
హామీ ఇచ్చారు.. విధుల్లో చేరతాం: వీఆర్ఏలు
సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చిందని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేస్తామని సీఎస్ సోమేశ్కుమార్ హామీ ఇవ్వడంతో సమ్మె విరమించి గురువారం నుంచి విధులకు హాజరు అవుతున్నామని వీఆర్ఏ జేఏసీ నేతలు రమేశ్ బహదూర్, దాదేమియా తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
నేటి నుంచి విధుల్లోకి: వంగా రవీందర్రెడ్డి
సమస్యలు పరిష్కరిస్తామని సీఎస్ హామీ ఇవ్వడంతో సమ్మెలో ఉన్న వారంతా గురువారం నుంచి విధులకు హాజరవుతారని ట్రెసా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగా రవీందర్రెడ్డి, కే గౌతమ్కుమార్ తెలిపారు. సీఎస్తో చర్చలు ముగిసిన తరువాత మీడియాతో వారు మాట్లాడుతూ.. వీఆర్ఏల డిమాండ్లపై సీఎస్తో చర్చించామని చెప్పారు. సమస్యలను పరిషరిస్తామని సీఎస్ హామీ ఇచ్చారని తెలిపారు. మునుగోడు ఉపఎన్నిక దృష్ట్యా నవంబర్ 7 తర్వాత నిర్ణయం తీసుకొంటామని చెప్పినట్టు వెల్లడించారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. వీఆర్ఏలకు పే సేల్, ఉద్యోగ భద్రత, ప్రమోషన్, కారుణ్య నియామకాలు అమలుచేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. నేడు సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీరావటంతో విధుల్లోకి చేరాలని నిర్ణయం తీసుకొన్నామని తెలిపారు. సమ్మెకాలం జీతం, సమ్మెకాలంలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవడం వంటి వాటిపై మునుగోడు ఉప ఎన్నికల తరువాత అమలుచేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.