Muncipal Elections | రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 48.54 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుతీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే పోలింగ్ సందర్భంగా పలు ప్రాంతాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ లక్ష్యంగా అక్కడక్కడా దాడులకు దిగింది.
పోలీసులు కూడా అధకార కాంగ్రెస్పట్ల పక్షపాతం చూపుతూ విపక్షాలపట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. బాన్సువాడ మున్సిపాలిటీలో పోలింగ్ బూత్ దగ్గర బందోబస్తులో ఉన్న ఓ కానిస్టేబుల్ కాంగ్రెస్ పార్టీకే ఓటేయండి అంటూ ఓటర్లను ప్రలోభపెట్టారు. మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ను పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈడ్చుకుంటూ బయటికి తీసుకొచ్చారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు. బీఆర్ఎస్ తిరగబడటంతో ఇరువర్గాల వాళ్లు గల్లాలు పట్టుకుని కొట్టుకున్నారు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో పోలీసులు కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్మోహన్రావు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆందోళనకు దిగారు.