సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో బీజేపీని ఒక్కసారి గెలిపిస్తే ఉరి వేసుకొన్నట్టేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలంటూ కేంద్ర మంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. ఉరి ఒక్కసారి వేసుకొంటే, రెండోసారికి అవకాశం ఉండదని చెప్పారు. విభజన చట్టంలోని హామీలు, మహిళా రిజర్వేషన్లు, తెలంగాణలో చేసిన అభివృద్ధిని చెప్పలేకపోయిన అమిత్షా.. దీనంగా తెలంగాణ ప్రజల కాళ్లు పట్టుకొని అడుక్కొన్నారని (లెగ్ బెగ్గింగ్) ఎద్దేవా చేశారు. బీజేపీ లాంటి ప్రమాదకర పార్టీని బలపరిచేందుకు ఎలాంటి అవకాశాలు ఇవ్వొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
బీజేపీ అధికారంలోకి వస్తుందనడం విడ్డూరం: చాడ
విభజన చట్టంలోని హామీలను పట్టించుకోని అమిత్షా.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పుకోవడం విడ్డూరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. సామరస్యానికి ప్రతీకైన తెలంగాణలో బీజేపీ నాయకులు మత విద్వేషాలు రగిలించేలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు. ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఆరాటం తప్ప, తెలంగాణ అభివృద్ధి పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదని అమిత్షా ప్రసంగంతో స్పష్టమైందని పేర్కొన్నారు.