Voters | హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 3,28,29,498 ఓటర్లు ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల ముసాయిదా జాబితాను వెల్లడించింది. మొత్తం ఓటర్లలో 1,64,01,046 మంది పురుష ఓటర్లు, 1,64,25,784 మంది మహిళా ఓటర్లు ఉండగా థర్డ్ జెండర్లు 2,668 మంది ఉన్నారని తెలిపింది.
గత అసెంబ్లీ నాటికి ఇప్పటికి ఆరు లక్షల మంది ఓటర్లు అదనంగా పెరిగారు. వీరికోసం 35,356 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 2024 జనవరి 1 నాటికి 18 ఏండ్ల వయస్సు నిండిన వారికి డిసెంబర్ 20 నుంచి జనవరి 5వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించారు. కొత్త ఓటర్ల నమోదు, మార్పులు చేర్పుల కోసం మొత్తం 11,99,850 దరఖాస్తులు వచ్చాయి.
ఇందులో కొత్తగా ఓటు కోసం 7,69,048 మందది దరఖాస్తు చేసుకోగా.. ఓటు తొలగింపు కోసం 2,90,123, చిరునామా మార్పు కోసం 1,40,679 మంది ఐప్లె చేసుకున్నారు. దరఖాస్తులను విచారణ చేసి ముసాయిదా జాబితాను ప్రచురించారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 22వ తేదీలోగా తెలుపవచ్చని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. అభ్యంతరాలను తెలిపేందుకు తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 20, 21వ తేదీల్లో ప్రత్యేకంగా బూత్స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని ప్రకటించారు.
ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను అక్కడే తెలుపవచ్చని, జాబితాపై వచ్చే అభ్యంతరాలను స్వీకరించి, అభ్యంతరాలను ఫిబ్రవరి 2వ తేదీలోగా పరిష్కరించనున్నట్టు వెల్లడించారు. ఫిబ్రవరి 8న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని, ఓటర్లు తమ ఓటు జాబితాలో ఉందో లేదో మరోసారి సరిచూసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఇదే జాబితా ఆధారంగా లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది.