రెండో దశపై బీసీసీఐ కసరత్తు
న్యూఢిల్లీ: ఇంగ్లండ్లో భారత పర్యటన ముగిసిన వెంటనే ఐపీఎల్ 14వ సీజన్లో మిగిలిన మ్యాచ్లు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. టీ20 ప్రపంచకప్నకు ముందే ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు ఐపీఎల్లో మిగిలిన 31 మ్యాచ్లను జరిపేలా ప్రణాళిక రచించాలని బోర్డు అనుకుంటున్నది. ఈ విషయంపై ఈ నెల 29న జరిగే ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఓ నిర్ణయానికి రావాలని బీసీసీఐ అనుకుంటున్నది. ఇంగ్లండ్లో టీమ్ఇండియా పర్యటన సెప్టెంబర్ 14న ముగియాల్సి ఉండగా.. రెండో టెస్టుకు, మూడు టెస్టుకు మధ్య ఉన్న 9 రోజుల అంతరాన్ని తగ్గించి షెడ్యూల్ కన్నా కాస్త ముందుగానే టూర్ అయిపోయేలా చూడాలని ఈసీబీని బీసీసీఐ కోరే అవకాశం ఉంది. అలాగే 14వ సీజన్లో మిగిలిన 31 మ్యాచ్లను ఇంగ్లండ్లో నిర్వహించాలని భారత బోర్డు తొలుత భావించినా.. మళ్లీ యూఏఈ వైపే చూస్తున్నట్టు సమాచారం. గతేడాది విజయవంతంగా టోర్నీ జరిగిన అరేబియన్ స్టేడియాల్లో మేలని భావిస్తున్నది. మరోవైపు ప్రస్తుతం భారత్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఇక్కడ టీ20 ప్రపంచకప్ నిర్వహణ సాధ్యమేనా అన్నది అనుమానంగా మారింది. మెగాటోర్నీపై జూన్లో ఓ నిర్ణయానికి రానున్న బీసీసీఐ భారత్లో సాధ్యం కాకపోతే ఈ టోర్నీని కూడా యూఏఈ వేదికగా జరిపే అవకాశం ఉంది.