నాంపల్లి: మునుగోడు నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారం టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీజేపీ మాటలు నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని సూచించారు. మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలంలో మంత్రి తలసాని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మూడున్నరేండ్లలో ఒక్కసారి కూడా గ్రామాలవైపు చూడలేదని వివర్శించారు.
నియోజకవర్గ అభివృద్ధి టీఆర్ఎస్ గెలుపుతోనే జరుగుతుందని చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా సబ్బండ వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని వెల్లడించారు. గ్రామీణ కులవృత్తులకు చేయూతను అందిస్తున్నదని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.