మునుగోడు గడ్డపై సీఎం కేసీఆర్ కాలు పెట్టడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఉద్యమ కాలంలో కేసీఆర్ ఈ ప్రాంతంలో కలియతిరిగారని, సీఎం కాగానే మునుగోడుకు మంచినీళ్లు ఇవ్వాలని చౌటుప్పల్లో మిషన్ భగీరథ పైలాన్ను ప్రారంభించారని చెప్పారు.
చర్లగూడెం ప్రాజెక్టు కడుతుంటే అనేక కేసులు పెట్టారని, అన్నింటినీ తిప్పికొట్టి నేడు ప్రాజెక్టు పనులు కొనసాగేలా చేశారని చెప్పారు. సీఎం కేసీఆర్ చండూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారని, రూ.570 కోట్ల నిధులు ఇచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. కారును గెలిపిస్తే కారు నిండా నిధులు ఇస్తామని చెప్పి మాట తప్పకుండా ఇచ్చారని చెప్పారు. మరోసారి అవకాశం ఇస్తే.. ఈ ప్రాంత అభివృద్ధి కోసం తన రక్తం ధార పోస్తానని, కేసీఆర్, మంత్రుల దీవెనలతో మునుగోడును మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు.