Hyderabad | హైదరాబాద్ నగరం రెప్పవాల్చితే.. అన్నీ పీడకలలే! కత్తిపోట్లతో నెత్తురోడుతున్న గతం… అంతలోనే!! ఇనుప కంచెలతో పోలీసు పహారా నడుమ నిర్మానుష్యంగా కనిపిస్తున్న దృశ్యాలు. అందుకే క్షణం కూడా కండ్లు మూసుకోలేని భయానక పరిస్థితులు. ఒక్కరోజు కాదు… ఒక్క సంఘటన కాదు! నాలుగు దశాబ్దాల్లో 2,700పైగా ఘటనలు!! ఇవేవో సాధారణంగా జరిగినవైతే సర్దుకుపోవచ్చు… ప్రకృతి వైపరీత్యాలైతే తలరాత అని నచ్చజెప్పుకోవచ్చు… కానీ ఇవేవీ కాకపోవడమే ఇప్పటికీ భావితరాలకు ఆ ఘోరాలు గుణపాఠాలుగా మారాయి.
దేశానికి స్వాతంత్య్రం తెచ్చామంటూ గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీ హయాంలో మత కలహాల పేరిట రేపిన కల్లోలాలు ఒకవంతైతే… కొన్ని పర్యాయాలు సీఎం కుర్చీ కోసం అమాయక జనాన్ని ఊచకోత కోయడం మరో వంతు. అదే హైదరాబాద్ మనసును గాయపరిచింది. ప్రతిష్ఠను దిగజార్చింది. మినీ ఇండియాలాంటి నగరాన్ని సైతం గజగజలాడేలా చేసింది. అందుకే నగరం రెప్పవాల్చడం లేదు. కన్నుమూస్తే కాళరాత్రులు తామర తంపరలుగా యాదిలోకి వస్తాయనే భయంతో క్షణంపాటైనా కనురెప్ప మూయకుండా 24 గంటలూ అప్రమత్తంగా ఉన్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నరేండ్లలో పకడ్బందీగా శాంతిభద్రతలు ఉండటంతో గుండె మీద చెయ్యి వేసుకొని నిబ్బరంగా ముందుకు పోతున్నది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలతో పాత గాయాలను మరిచి ప్రగతిపథం వైపు దూసుకుపోతున్నది.
మరి… ఈ తొమ్మిదిన్నరేండ్ల ప్రశాంతతను భగ్నం చేసుకుంటే తిరిగి హైదరాబాద్ నిద్రలోకి జారుకుంటుంది. నాటి పాత గాయాలు మళ్లీ తిరగబడతాయి. నిబ్బరంగా ఉన్న నగరం భయం నీడలోకి పోతుంది. తెలంగాణకు ఆర్థిక చోదక శక్తిలా ఉన్న హైదరాబాద్ నగరం అభివృద్ధికి దూరమై అంధకారంలోకి నెట్టివేయబడుతుంది. అందుకే తెలంగాణ సమాజం అసెంబ్లీ ఎన్నికల రూపంలో ఒక అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నది. మత కల్లోలాలతో గుండెకాయలాంటి హైదరాబాద్లో చిచ్చు పెట్టుకుందామా? ఇదే ప్రశాంతతతో కూడిన ప్రగతి పథాన్ని కొనసాగించుకుందామా? అనేది నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది.
హైదరాబాద్ నగరం ఉలిక్కిపడితే అనేక రాష్ర్టాల్లోని ప్రజలు కలవరపడతారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పొట్ట చేతపట్టుకొని దేశం నలుమూలల నుంచి వచ్చే లక్షలాది మందిని అక్కున చేర్చుకుంటుంది. అందుకే నగరంలో ఏ చిన్న సంఘటన జరిగినా ఇక్కడ ఉండే అనేక రాష్ర్టాల్లోని బంధువుల గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. తెలంగాణ ఏర్పడేనాటికి హైదరాబాద్ నగర దుస్థితి అదే. తరచూ కర్ఫ్యూ నీడలోకి వెళ్లే ఈ నగర జీవనం నిత్యం భయం భయంగా సాగేది. దాదాపు 44 సంవత్సరాల కాంగ్రెస్ ఏలుబడిలో జరిగిన మత ఘర్షణలు… విద్రోహ చర్యలతో వందలాది మంది మృత్యువాతపడితే, వేలాది మంది మానని ఆ గాయాలతో నేటికీ జీవశ్చవాల్లా బతుకీడుస్తున్నవారెందరో ఉన్నారు. చీటికీమాటికీ జరిగే ఈ ఘర్షణలు… విధించే కర్ఫ్యూలతో సామాన్యుడి బతుకు బండి నిలిచిపోవడమే కాకుండా అన్ని రంగాలూ కుదేలై ఆర్థిక వ్యవస్థ సైతం అతలాకుతలమైన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా 1978 నుంచి 2014 వరకు హైదరాబాద్ నగరంలో మతకలహాలు, బాంబు పేలుళ్లతో అట్టుడికి పోయేది. ఆ సమయంలో శాంతిభద్రతలు సరిగా లేక ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించేవారు. ఒక పక్క మత కలహాలు, మరో పక్క హత్యలు, మారణకాండలు, దోపిడీలు, దొమ్మీలు చేస్తూ నగర ప్రజలను సంఘ విద్రోహ శక్తులు పీల్చిపిప్పి చేశాయి. తెలంగాణ ఏర్పడక ముందు 36 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 2,703 మత ఘర్షణలకు సంబంధించిన ఘటనలు జరిగాయి.. అందులో 554 మంది మృతి చెందారు. 4,798 మంది గాయపడ్డారు.
1978 నుంచి వరుసగా ప్రతి యేడూ మత ఘర్షణలు 1985 వరకు జరిగాయి.. ఆ తర్వాత మూడేండ్లు బాగానే ఉన్నా తిరిగి వరసగా 2014 (తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన జూన్ 2 వరకు) ఘటనలు జరుగుతూ వచ్చాయి. ఈ ఘటనల్లో 554 మంది ప్రాణాలు కోల్పోయారు. 4,798 మంది గాయాల పాలయ్యారు. హిందు, ముస్లిం పండుగలు వచ్చాయంటే హైదరాబాద్లోని ప్రజలు భయాందోళనలతో ఉండేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1978 నుంచి నగరంలో మత ఘర్షణలు జరిగాయి. 1978, 1979, 1980,1981, 1984, 1990ల్లో ఎక్కువగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. 11 సార్లు 113 రోజులపాటు కర్ఫ్యూ విధించారు.
ఒకవైపు హైదరాబాద్ నగరంలో తరచూ ఘర్షణలు పలు బాంబు దాడులు, పేలుళ్లు జరిగాయి. వందలాది మంది ఈ ఘటనల్లో బాధితులయ్యారు. ఇతర ప్రాంతాల్లో మతపరమైన ఘటనలు ఉగ్రవాద దాడులకు దారి తీశాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు హైదరాబాద్లో అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు పన్నాయి.. బాంబులు పేల్చి అమాయకులను బలిగొన్నాయి. లుంబినీ పార్కు, గోకుల్ చాట్లో జరిగిన పేలుళ్లు.. అంతకు ముందు మక్కా మసీదు వద్ద జరిగిన పేలుళ్లను నిరసిస్తూ చేశామంటూ ఉగ్రవాద సంస్థ పేర్కొన్నది. మత ఘర్షణలకు, ఉగ్రవాద సంస్థలకు ఒకదానితో ఒకటి లింకు ఉండడంతో హైదరాబాద్ గతంలో అట్టుడికిపోయేది.
☞ 29/11/1992 రోజు హిజ్బుల్ ముజాహిద్దీన్కు చెందిన ఉగ్రవాదులు టోలీచౌకి దగ్గర అదనపు ఎస్పీ (ఎస్ఐబీ) కృష్ణప్రసాద్, అతని గన్మెన్ను కాల్చివేశారు.
☞ 1993-1994వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా లష్కరేతోయిబా ఉగ్రవాద సంస్థ 53 బాంబు పేలుళ్లకు పాల్పడింది. ఈ సంస్థ ఉగ్రవాద సభ్యులకు వరంగల్కు చెందిన అజాంఘోరీ తంజీమ్ తీవ్రవాద సాహిత్యాన్ని అందించి, పేలుళ్లకు తనవంతు సహకారం అందించాడని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
☞ 1999 నవంబర్లో హైదరాబాద్ను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడతామని, దాని ద్వారా జమ్ముకశ్మీర్ విమోచన జరుగుతుందని లష్కరేతోయిబాకు చెందిన హఫీజ్ మహ్మద్ షాహీద్ ప్రకటించాడు.
☞ 21/11/2002న దిల్సుఖ్నగర్ సాయిబాబా గుడి వద్ద లష్కరేతోయిబా ఉగ్రవాద సంస్థ నేతృత్వంలో బాంబు పేలుళ్లలో ఇద్దరు మృతి చెందగా, 19 మంది గాయపడ్డారు.
☞ 2002 డిసెంబర్లో ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ తమిళనాడుతోపాటు దక్షిణ భారతదేశంలో బాంబు పేలుళ్లకు పథకం రచించిన హైదరాబాద్కు చెందిన అబూ హంజా అలియాస్ అబ్దుల్ బారీ
☞ 26/3/2003న గుజరాత్ హోంమంత్రిని కాల్చి చంపేందుకు నల్లగొండకు చెందిన లష్కరేతోయిబా సంస్థకు చెందిన అస్గర్ అలీ, హైదరాబాద్కు చెందిన అబ్దుల్ బారీ పథకం వేసి హతమార్చారు.
☞ 12/10/2005న హర్కతుల్ ఉల్ జిహాద్ అల్ ఇస్లామిక్ సంస్థకు చెందిన మానవ బాంబు బేగంపేట్లోని హైదరాబాద్ టాస్క్ఫోర్స్ కార్యాలయాన్ని పేల్చేసింది.
☞ 8/3/2006న లష్కరేతోయిబా సానుభూతిపరులు గులాం యజ్దానీ ఢిల్లీ పోలీసుల ఎదురు కాల్పుల్లో మృతిచెందాడు.
☞ 18/5/2007న మక్కా మసీదులో బాంబు పేలుళ్లు, 9 మంది మృతి, 50 మందికి గాయాలు, పేలుళ్లలో అభినవ్ భారత్ సంస్థ పాత్ర.
☞ 25/8/2007న హైదరాబాద్లోని లుంబినీ పార్కు, గోకుల్ చాట్లో బాంబు పేలుళ్లు, 43 మంది మృతి, 47 మందికి గాయాలు, పేలుళ్లకు పాల్పడింది ఇండియన్ ముజాహిదీన్ సంస్థ.
☞ 2007లో లష్కరే తోయిబా ఉగ్రవాది షాహిద్ బిలాల్ పాకిస్తాన్లోని కరాచీలో కాల్చివేత
☞ 26/11/2008న ముంబయిలో ఉగ్రవాదుల కాల్పులు, అనుమానితుడిగా ఉన్న లష్కరే తోయిబాకు చెందిన జబీయుద్దీన్ అన్సారీ హైదరాబాద్లో నకిలీ ఐడీ కార్డులు సృష్టించాడు.
☞ 2009-10లో వికార్ అహ్మద్ మక్కా మసీదు వద్ద పోలీసులు కాల్పులు జరిపారనే అనుమానంతో ముగ్గురు పోలీసులను కాల్చి, ఐదుగురిని గాయపరిచాడు, 12 దోపిడీల్లో వికార్ ముఠా పాత్ర.
☞ 21/2/2013న దిల్సుఖ్నగర్లో జంట పేలుళ్లు, 17 మంది మృతి, 138 మందికి గాయాలు, పేలుళ్లలో ఇండియన్ ముజాహిదీన్ పాత్ర.
గతంలో హైదరాబాద్లో ఘర్షణ చెలరేగిందే మొదలు… తెలంగాణలోని నిజామాబాద్, ఇతర జిల్లాకేంద్రాల్లో పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేవి. ముఖ్యంగా మత ఘర్షణలు జరిగిన సందర్భాలను పరిశీలిస్తే… ఇక్కడ ఏ చిన్న ఘటన జరిగినా సరైన శాంతిభద్రతల పరిరక్షణ లేకపోవడం, పటిష్టమైన చర్యలు తీసుకోకపోవడంతో రోజుల తరబడి రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు భయం గుప్పిట్లో గడపాల్సి వచ్చేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా ఆ పరిస్థితి తలెత్తలేదు.
హైదరాబాద్ అంటేనే మత సామరస్యానికి ప్రతీక. తొమ్మిదిన్నరేండ్లుగా గంగా-జమునా తహజీబ్కు నిదర్శనంగా నిలిచిందీ నగరం. అందుకు ఇటీవల చోటుచేసుకున్న పరిణామమే తాజా ఉదాహరణ. ఈ ఏడాది సెప్టెంబర్ 28న గణేశ్ నిమజ్జనం… మిలాద్-ఉన్-నబీ ఒకే రోజు రాగా, ముస్లింలు తమ ఊరేగింపును వాయిదా వేసుకొని గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసేందుకు సంపూర్ణ సహకారం అందించారు. మత ఘర్షణలతో అట్టుడికిన ఈ నగర నేలపై ఇలా మత సామరస్యం పరిఢవిల్లడమంటే పాలకుల దారిలో ప్రగతి దృక్పథం వైపు ప్రజల ఆలోచనలు ఉన్నాయని స్పష్టమవుతున్నది.
సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో శాంతిభద్రతల నిర్వహణకు చర్యలు తీసుకోవడంతోపాటు అందరినీ అభివృద్ధి వైపు మళ్లించడంతో ప్రజల దృక్పథంలోనే మార్పు వచ్చింది. ఒకవైపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాంతిభద్రతల నిర్వహణ ముఖచిత్రాన్ని మార్చారు. మరోవైపు అభివృద్ధిని పరుగులు పెట్టించడంతోపాటు ప్రజల ఉద్యోగ, ఉపాధి అవకాశాలను గణనీయంగా పెంచారు. దీంతో యువత ఆలోచనా విధానంలోనూ గుణాత్మక మార్పు వచ్చింది. తద్వారా ప్రశాంత వాతావరణానికి అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తున్నారు.
దేశంలో ఎక్కడ ఉగ్రవాదులు బాంబులు పేల్చినా.. దాని మూలాలు హైదరాబాద్ నగరంలో తేలేవి. అందుకే దేశవ్యాప్తంగా ఈ ఘటనలు జరిగినపుడు కచ్చితంగా పత్రికల్లో పతాక శీర్షికలో హైదరాబాద్ పేరు మార్మోగేది. చివరకు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించినా ఇక్కడ పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కౌంటర్ దేశంలో ఎక్కడాలేని విధంగా ఇంటెలిజెన్స్ బలోపేతం చేశారు. అందుకే ఇప్పటివరకు తొమ్మిదిన్నరేండ్లలో కించిత్ ఉగ్రవాద చర్య కూడా జరగలేదు. పైగా నల్లగొండలో ముందుగానే ఉగ్రవాదుల కదలికల్ని పసిగట్టి ఇద్దరిని మట్టుబెట్టారు. పాకిస్తాన్ నుంచి కశ్మీరు మీదుగా దేశంలోకి ప్రవేశించే ఉగ్రవాదులను పసిగట్టడంలో మన కౌంటర్ ఇంటెలిజెన్స్ సేవలు అనిర్వచనీయం. కేంద్రానికి సైతం ముందస్తు సమాచారం ఇచ్చే స్థాయిలోకి మన విభాగం ఎదిగింది. గత ఏడాది దసరా సందర్భంగా ముగ్గురు ఉగ్రవాదులు గ్రైనేడ్లతో పేలుళ్లకు పాల్పడి విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు ముందుగానే గుర్తించిన కౌంటర్ ఇంటెలిజెన్స్ వారిని అరెస్టు చేసి, ముప్పును నివారించింది. ఇలా దేశంలోనే తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆదర్శంగా నిలిచింది.
…? గోవింద్ రవికుమార్/గుండాల కృష్ణ