హైదరాబాద్ : రైల్వే కొత్త లైన్ల మంజూరులో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని, రాష్ట్రంపై కేంద్రం వివక్షను చూపుతోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. ఈ విషయంలో న్యాయం చేయాలని కోరుతూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు గురువారం ఆయన లేఖ రాశారు. రానున్న రైల్వే బడ్జెట్ సమావేశాల్లోనైనా రాష్ట్రానికి కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయాలని కోరారు. తెలంగాణ దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రగతిశీల రాష్ట్రమని, పలు రాష్ట్రాల నుంచి జీవనోపాధికోసం పెద్ద సంఖ్యలో తెలంగాణకు వలస వస్తున్నారన్నారు.
దీంతో రైల్వే రవాణాకు ప్రాధాన్యం చేకూరుతుందన్నారు. దీనికి తోడు ఇతర రాష్ట్రాలకు గతంలో వలస వెళ్లిన తెలంగాణ వాసులు స్వరాష్ట్రానికి తిరిగి వస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో పుష్కలంగా నీరు, విద్యుత్ లభ్యత ఉండడం, ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా పకడ్బందీగా అమలు చేస్తుండడంతో రాష్ట్రానికి ప్రజలు తిరిగి రావడానికి కారణమన్నారు. ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణానికి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుదని, అందుకు కొత్త రైల్వేలైన్లను మంజూరు చేయాలని కేంద్రమంత్రిని డిమాండ్ చేశారు. తెలంగాణ కొత్త రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కేవలం కొత్తపల్లి – మనోహరాబాద్ రైల్వేలైన్ మాత్రమే మంజూరైందన్నారు.
అది కూడా ప్రభుత్వం ఉచితంగా భూమిని సమకూర్చి.. మూడో వంతు నిర్మాణ ఖర్చను భరించినందుకే రైల్వేలైన్ వచ్చిందని వినోద్కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన చట్టం 13వ సెక్షన్ ప్రకారం కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఆరు నెలల కాలంలోనే రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పాలని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ.. అది ఇప్పటి వరకు అతిగతి లేకుండా పోయిందని వినోద్ కుమార్ ఆరోపించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పితే రైల్వే కనెక్టివిటీ పెరుగుతుందని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి రైల్వే కొత్త లైన్ల కోసం 11 ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపామని, ఏవో కుంటి సాకులు చెబుతూ కేంద్ర రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పక్కన పెట్టిందని వినోద్ కుమార్ ఆరోపించారు.