కరీంనగర్ : కాంగ్రెస్ పార్టీ పాలనపై కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్(Vinod Kumar) ఫైర్ అయ్యారు. మార్పు తెస్తాం.. అందరిని ఉద్దరిస్తాం.. రైతు రాజ్యం తెస్తాం..రైతుల బాధలు తీరుస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు వట్టి నీటిమూటలుగా మారిపోతున్నాయని అన్నారు. మంగళవారం కరీంనగర్(Karimnagar) జిల్లా మానకొండూర్ మండలం ముంజంపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని(Grain Purchase) సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మద్దతు ధరకు ధాన్యం కొనడంతో పాటు క్వింటాలుకు రూ.500ల బోనస్ ఇస్తామన్నారు. బోనస్ పైసలు దేవుడెరుగు ఉన్న ధాన్యమే కొంటలేరని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచులు అందుబాటులో లేవని, ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని ఇప్పుడు ఆగస్టు 15లోగా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్లు వేస్తున్నారని విమర్శించారు. యాసంగి పంటలకు సాగునీళ్లు ఇవ్వకపోవడంతో పంటలు ఎండి కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ళకు వేగవంతంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి.రామకృష్ణా రావు, జెడ్పీటీసీ శేఖర్ గౌడ్, తదితరులు ఉన్నారు.