హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): పార్లమెంటు వేదికగా కేంద్ర జల్శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పచ్చి అబద్ధాలు చెప్పారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ మం డిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని తెలంగాణ కోరనేలేదని మంత్రి చెప్పడం పై ఆగ్రహం వ్యక్తంచేశారు. తప్పు డు ప్రకటనను వెంటనే ఉపసంహరించుకొని, వాస్తవాలతో కూడిన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బిశ్వేశ్వర్పై పార్లమెంటులో బీఆర్ఎస్ తరపున ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని హెచ్చరించారు.
కేంద్రం ఇకనైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు, కృష్ణా నదిపై పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మిస్తున్నందున ఈ రెండు ప్రాజెక్టుల్లో ఏదో ఒక దానికి జాతీయహోదా ఇవ్వాలని 2018 జూలై 20న తాను ఎంపీగా పార్లమెంటులో ప్రధాని మోదీతోపాటు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశానని గుర్తుచేశారు. తన మాటలు పార్లమెంటు రికార్డుల్లో ఉన్నాయని, వాటిని తెప్పించుకొని బిశ్వేశ్వర్ వినాలని సూచించారు. అప్పుడన్నా కనువిప్పు కలుగుతుందని అన్నారు. అప్పట్లో కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. దేశంలో ఏ ప్రాజెక్టుకూ జాతీయహోదా ఇవ్వబోమని పార్లమెంటు సాక్షిగా ప్రకటించారని గుర్తుచేశారు. కానీ ఆ తర్వాత బీజేపీ రాష్ర్టాల్లోని ప్రాజెక్టులకు జాతీయహోదా ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.
ఉత్తరప్రదేశ్లో ఎన్నికల సమయంలో కెన్బెట్వా ప్రాజెక్టుకు రూ.45 వేల కోట్లు, కర్ణాటకలోని అప్పర్భద్రకు రూ.15 వేల కోట్లు కేటాయిస్తూ, జాతీయహోదా ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించిందని వినోద్గుర్తుచేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిపడ్డారు. బీజేపీ రాష్ర్టాలకు అందలం, తెలంగాణ ప్రాజెక్టులకు మొండిచెయ్యి చూపుతున్నారని, ఇదెక్కడి న్యాయమని నిలదీశారు. తెలంగాణ ఏర్పడిన ఐదు రోజులకే ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ కలిశారని.. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల్లో కనీసం ఒక్కదానికైనా జాతీయహోదా ఇవ్వాలని వినతిపత్రం అందజేశారని గుర్తుచేశారు. మంత్రి హరీశ్రావు సైతం కేంద్రానికి, అప్పటి మంత్రి ఉమాభారతికి అనేకసార్లు వినతిపత్రాలు అందజేశారని తెలిపారు. కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ మాత్రం ఈ సత్యాలన్నింటినీ దాచేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. రాజకీయాలు పార్లమెంటు బయట చూసుకోవాలని, అత్యున్నత చట్టసభ సాక్షిగా కేంద్ర మంత్రి పచ్చి అబద్ధాలు చెప్పడం ఏ మాత్రం సంస్కారం కాదని హితవు చెప్పారు. వెంటనే తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని, పార్లమెంటు సాక్షిగా నిజాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.