హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థ ప్రైవేటీకరణ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ధ్వజమెత్తారు. పార్లమెంట్లో ఒకమాట.. రామగుండంలో మరో మాట ఉంటుందా? అని నిలదీశారు. సింగరేణి ప్రైవేటీకరణపై పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్జోషి చెప్పిన విషయాలు, శనివారం రామగుండంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. నిరుడు డిసెంబర్లో ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి సింగరేణి కార్మికుల సమ్మెపై పార్లమెంట్లో లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్జోషి సమాధానం ఇచ్చారని వినోద్కుమార్ గుర్తుచేశారు. తెలంగాణలో సింగరేణి కాలరీస్కు సంబంధించిన కల్యాణఖని బ్లాక్-6, కోయిల్గూడెం బ్లాక్-3, సత్తుపల్లి బ్లాక్-3, శ్రావణపల్లి బ్లాకులను వేలం వేయరాదని, వాటిని సింగరేణికే అప్పజెప్పాలని కార్మికులు సమ్మె చేయడంతో ప్రహ్లాద్జోషి స్పష్టమైన సమాధానమిచ్చారని, నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్-1957 నిబంధనల కింద ఆ బ్లాకులన్నింటినీ బహిరంగంగా వేలం వేయాలని సింగరేణి సంస్థను ఆదేశించినట్టు చెప్పారని తెలిపారు.