హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగా ణ): రాష్ర్టాన్ని రాజకీయంగా, ఆర్థికంగా, సా మాజికంగా అస్థిరపరిచేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ ఆగ్రహం వ్య క్తం చేశారు. శుక్రవారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణ సాధికారత పేరుతో మోదీ పర్యటన ఉద్దేశం రాష్ర్టాన్ని గందరగోళ పరిచి ప్రయోజనం పొం దడమేనని విమర్శించారు. ఇతర రాష్ర్టాల మా దిరిగానే తెలంగాణలోనూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మొదటి నుంచీ మోదీ తెలంగాణను నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ను ప్రయోగించి, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేశారని ఆరోపించారు.
తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర చేస్తున్న మోదీ రాష్ట్ర అభివృద్ధికి వీసమెత్తు సహకారం అందించలేదని వినోద్కుమార్ మండిపడ్డారు. జాతీయ రహదారులు తెలంగాణ హక్కు అని, ఈ మేరకు విభజన చట్టం హామీ ఇచ్చిందని చెప్పారు. తెలంగాణ ఆవిర్భవించిన తొలినాళ్లలో సీఎం కేసీఆర్ సూచన మేరకు బీఆర్ఎస్ ఎంపీలు అనేక సందర్భాల్లో ప్రధాని మోదీతోపాటు అప్పటి కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి రాష్ర్టానికి 23 జాతీయ రహదారులు కావాలని కోరారని చెప్పారు. వీటిలో నాలుగైదింటిని మాత్రమే కేంద్రం అంగీకరించిందని తెలిపారు. మరో 14 ఎన్హెచ్లకు సూత్రప్రాయంగా ఆమోదించినా ఇప్పటివరకూ చేపట్టలేదని విమర్శించారు.
సికింద్రాబాద్కు వస్తున్న మోదీ తెలంగాణకు ఎందుకు అన్యాయం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో అత్యధిక లాభాలు ఆర్జిస్తున్న సికింద్రాబాద్ రైల్వే జోన్కు ఎందుకు అన్యాయం చేస్తున్నారని నిలదీశారు. రాబడి ఎక్కువ ఉన్న ప్రాంతానికి రైల్వే కనెక్టివిటీని ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. విభజన చట్టం హామీ ఇచ్చినా కేంద్రం ఎందుకు ఏర్పాటు చేయడం లేదని నిలదీశారు. కాజీపేటలో ఉన్న రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్షాప్నే కోచ్ ఫ్యాక్టరీగా బీజేపీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటని ఎద్దేవాచేశారు. ప్రతీ జిల్లాకు నవోదయ విద్యాలయాల ఏర్పాటు విషయంలో మోదీ వైఖరేమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వీటిపై రాష్ర్టానికి చెందిన బీజేపీ ఎంపీలు ఎందుకు కేంద్రాన్ని అడగడం లేదని ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డితో సహా నలుగురు బీజేపీ ఎంపీలు తెలంగాణ ప్రయోజనాల కోసం పార్లమెంట్లో కనీసం నాలుగు సెకండ్లు అయినా మాట్లాడారా? అని నిలదీశారు. వీరికి తెలంగాణ ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలని నిప్పులు చెరిగారు.
దేశంలో గవర్నర్ల వ్యవస్థను సవరించాలని కోరుతూ ఇప్పటికే నేషనల్ లా కమిషన్కు లేఖరాశామని వినోద్కుమార్ చెప్పారు. రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని శాసనసభలో బిల్లులు ఆమోదించి గవర్నర్కు పంపితే వాటిని ఎంతకాలం పెండింగ్లో పెడతారని ప్రశ్నించారు. గవర్నర్లు బిల్లులను ఆమోదించకుండా జాప్యం చేయడం వల్ల రాష్ర్టాలకు తీవ్ర నష్టం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
మోదీది సంకుచిత మనస్తత్వమని, ప్రొటోకాల్ను ఉల్లంఘించింది ఆయనే అని వినోద్కుమార్ పేర్కొన్నారు. కరోనా సమయంలో భారత్ బయోటెక్ సంస్థను సందర్శించేందుకు వస్తున్న ప్రధానికి స్వాగతం పలికేందుకు రాష్ట్ర సీఎం కేసీఆర్ను రావద్దని ప్రధాని కార్యాలయం చెప్పిన విషయాన్ని ఉదహరించారు. సీఎం కేసీఆర్కు ఉన్న సంస్కారం మరెవ్వరికీ లేదని పేర్కొన్నారు. ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం తెలంగాణ అన్నారు. అహంకారపూరిత మోదీకి తెలంగాణ ఎన్నడూ భయపడదని తేల్చిచెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ముద్దసాని సహోదర్రెడ్డి, ఎల్ రూప్సింగ్ తదితరులు పాల్గొన్నారు.